1

1

దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితోకూడ ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను.౹

2 యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక

3 సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరులయిండ్లకు పెద్దలైనవారికందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును

4 సొలొమోనుతోకూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను.౹

5 హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.౹

6 సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.

7

ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై–నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగు మని సెలవియ్యగా

8 సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెను–నీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించియున్నావు గనుక

9 దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైనజనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు

10 ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.౹

11 అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు ఈ ప్రకారము యోచించుకొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు.౹

12 కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.౹

13 పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను.

14

సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమకూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను.౹

15 రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను.౹

16 సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.౹

17 వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.

2

1

సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని

2 బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని, కొండలమీద మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని ఏర్పరచుకొని వీరిమీద మూడువేల ఆరువందలమందిని అధిపతులుగా ఉంచెను.౹

3 సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము.౹

4 నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.౹

5 నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక

6 ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.౹

7 నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడై యుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలుతోను చేయుపనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము.౹

8 మరియు లెబానోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది.౹

9 కాగా లెబానోనునుండి సరళమ్రానులను దేవదారుమ్రానులను చందనపుమ్రానులను నాకు పంపుము; నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితోకూడ పోవుదురు.౹

10 మ్రానులుకొట్టు మీ పనివారికి నాలుగువందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిదివందల పుట్ల యవలను నూట నలువదిపుట్ల ద్రాక్షారసమును నూట నలువదిపుట్ల నూనెను ఇచ్చెదను.

11

అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసిపంపిన ఉత్తరమేమనగా–యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారిమీద రాజుగా నియమించియున్నాడు.౹

12 యెహోవాఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక.౹

13 తెలివియు వివేచనయుగల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీయొద్దకు పంపు చున్నాను.౹

14 అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పని చేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గల వాడు.౹

15 ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల

16 మేము నీకు కావలసిన మ్రానులన్నియు లెబానోనునందు కొట్టించి వాటిని నీకొరకు సముద్రముమీద తెప్పలుగా యొప్పేకు కొనివచ్చెదము, తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొన వచ్చును అని వ్రాసెను.

17

సొలొమోను తన తండ్రియైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్షయెనుబదిమూడువేల ఆరువందలమందియైరి.౹

18 వీరిలో బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని పర్వతములందు మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని, జనులమీద అధిపతులుగానుండి పనిచేయించుటకు మూడువేల ఆరు వందలమందిని అతడు ఏర్పరచెను.

3

1

తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారం భించెను.౹

2 తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవనెల రెండవదినమందు దాని కట్టనారంభించెను.౹

3 దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.౹

4 మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, నూట ఇరువది మూరలు ఎత్తు, దాని లోపలిభాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను.౹

5 మందిరపు పెద్ద గదిని దేవదారుపలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి

6 ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీమునుండి వచ్చినది.౹

7 మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడలమీద కెరూబులను చెక్కించెను.౹

8 మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను; దాని పొడవు మందిరపు వెడల్పునుబట్టి యిరువది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు, వెయ్యిన్ని రెండు వందల మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను.౹

9 మేకుల యెత్తు ఏబది తులముల బంగారు; మీది గదులను బంగారముతో పొదిగించెను.౹

10 అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను.౹

11 [11-12] ఆ కెరూబుల రెక్కల పొడవు ఇరువది మూరలు, ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను, రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను.౹

12

13 ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు ఇరువది మూరలు వ్యాపించెను, కెరూబులు పాదములమీద నిలువబడెను, వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి యుండెను.౹

14 అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను.౹

15 ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై ముప్పదియయిదు మూరల యెత్తుగల రెండు స్తంభములను వాటిమీదికి అయిదు మూరల యెత్తుగల పీటలను చేయించెను.౹

16 గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పైభాగమున దాని ఉంచి, నూరు దానిమ్మపండ్లను చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించెను.౹

17 ఆ రెండు స్తంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు ఎడమతట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడితట్టు దానికి యాకీను అనియు, ఎడమతట్టు దానికి బోయజు అనియు పేళ్లు పెట్టెను.

4

1

అతడు ఇరువది మూరలు పొడవును ఇరువది మూరలు వెడల్పును పది మూరలు ఎత్తునుగల యొక యిత్తడి బలిపీఠమును చేయించెను.౹

2 పోతపోసిన సముద్రపు తొట్టి యొకటి చేయించెను, అది యీ యంచుకు ఆ యంచుకు పది మూరల యెడము గలది; దానియెత్తు అయిదు మూరలు, దాని కైవారము ముప్పదిమూరలు,౹

3 దాని క్రిందితట్టున ఎద్దులు రూపింపబడియుండెను, అవి ఒక్కొక్క మూరకు పదేసియుండెను, అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను; ఎద్దులు రెండు వరుసలు తీరి యుండెను, అవి తొట్టితోకూడనే పోతపోయబడెను.౹

4 అది పండ్రెండు ఎద్దులమీద నిలువబడెను, మూడు ఎద్దులు ఉత్తరపుతట్టు మూడు పడమటితట్టు మూడు దక్షిణపుతట్టు మూడు తూర్పుతట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచ బడెను, వాటి వెనుకటి పార్శ్వములన్నియు లోపలికి తిరిగి యుండెను.౹

5 అది బెత్తెడు దళముగలది, దాని అంచు గిన్నెయంచువంటిదై తామరపుష్పములు తేల్చబడియుండెను; అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును.

6

మరియు దహనబలులుగా అర్పించువాటిని కడుగుటకై కుడితట్టుకు అయిదును ఎడమతట్టుకు అయిదును పది స్నానపు గంగాళములను చేయించెను; సముద్రమువంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు.౹

7 మరియు వాటినిగూర్చిన విధిననుసరించి పది బంగారపు దీపస్తంభములను చేయించి, దేవాలయమందు కుడితట్టున అయిదును ఎడమతట్టున అయిదును ఉంచెను.౹

8 పది బల్లలను చేయించి దేవాలయమందు కుడితట్టున అయిదును ఎడమతట్టున అయిదును ఉంచెను; నూరు బంగారపు తొట్లను చేయించెను.౹

9 అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను.౹

10 సముద్రపు తొట్టిని తూర్పుతట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను.౹

11 హూరాము పాత్రలను బూడిదె నెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను; రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పనియంతయు హూరాము సమాప్తిచేసెను.౹

12 దాని వివరమేమనగా, రెండు స్తంభములు, వాటి పళ్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్లెములు, ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పుటకైన రెండు అల్లికలు,౹

13 ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.౹

14 మట్లు, మట్లమీదనుండు తొట్లు,౹

15 సముద్రపుతొట్టి దాని క్రింద నుండు పండ్రెండు ఎద్దులు,౹

16 పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.౹

17 యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకునుమధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోతపోయించెను.౹

18 ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.౹

19 దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,౹

20 వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,౹

21 పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.౹

22 మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగారముతో చేయబడెను.

5

1

సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను.౹

2 తరువాత యెహోవా నిబంధనమందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమకూర్చెను.౹

3 ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.౹

4 ఇశ్రాయేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి

5 రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱెలను పశువులను బలిగా అర్పించిరి.౹

6 లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని తీసికొని వచ్చిరి.౹

7 మరియు యాజకులు యెహోవా నిబంధనమందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.౹

8 మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను.౹

9 వాటి కొనలు గర్భా లయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెనుగాని అవి బయటికి కనబడలేదు. నేటివరకు అవి అచ్చటనే యున్నవి.౹

10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.౹

11 యాజకులు పరిశుద్ధస్థలమునుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరును తమ వంతులు చూడకుండ తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.౹

12 ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి;౹

13 వారితోకూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.౹

14 అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి.

6

1

అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను— గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.౹

2 నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి

3 రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.౹

4 మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను–నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.౹

5 ఆయన సెలవిచ్చినదేమనగా–నేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై యే మనుష్యునియైనను నేను నియమింపలేదు.౹

6 ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.౹

7 ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రియైన దావీదు మనోభిలాష గలవాడాయెను.౹

8 అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగా–నా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదేగాని

9 నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.౹

10 అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి

11 యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దానియందు ఉంచితినని చెప్పి

12 ఇశ్రాయేలీయులందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.

13

తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయులందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.౹

14 –యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమియందైనను లేడు.౹

15 నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు.౹

16 –నీవు నాముందర నడచి నట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీయుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము.౹

17 ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక.౹

18 మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?

19 దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధినిచేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.౹

20 నీ సేవకులు ఈ స్థలముతట్టు తిరిగిచేయు విన్నపములను వినుటకై— నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక.౹

21 నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.౹

22 ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతనిచేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు

23 నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.౹

24 నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృిష్టి యెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు, వారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల

25 ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక.౹

26 వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగినయెడల

27 ఆకాశ మందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి, నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక.౹

28 దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడివేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను

29 ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపిచేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి

30 నీవు మా పితరులకిచ్చిన దేశమందువారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులుకలిగి

31 నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.౹

32 మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, చాచిన చేతులనుగూర్చియు వినినవారై, దూరదేశము నుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపముచేసినపుడు

33 నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.౹

34 నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరు కొనిన యీ పట్టణముతట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినయెడల

35 ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థ నను ఆలకించి వారికార్యమును నిర్వహించుదువుగాక.౹

36 పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువులచేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టిగాని సమీపమైనట్టిగాని తమ దేశములకు పట్టుకొనిపోగా

37 వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని–మేము పాపముచేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడచితిమి అని ఒప్పుకొని

38 తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని, తమపితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల

39 నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారికార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక.౹

40 నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.౹

41 నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.౹

42 దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాఙ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.

7

1

సొలొమోను తానుచేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మందిరమునిండ నిండెను,౹

2 యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.౹

3 అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.౹

4 రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి.౹

5 రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమతమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరును నిలిచియుండగను

6 రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి.

7

మరియు తాను చేయించిన యిత్తడి బలిపీఠము దహనబలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను.౹

8 ఆ సమయమందు సొలొమోనును, అతనితోకూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములోనుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి

9 యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.

10

ఏడవ నెల యిరువది మూడవ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును, ఎవరి గుడారములకు వారు వెళ్లునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను.౹

11 ఆప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవామందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపములేకుండ నెరవేర్చి పని ముగించెను.

12

అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని.౹

13 వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని,౹

14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.౹

15 ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,౹

16 నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును.౹

17 నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించినయెడల

18 ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును.౹

19 అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినయెడల

20 నేను మీకిచ్చిన నా దేశములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసి వేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.౹

21 అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది–యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా

22 జనులు–ఈ దేశస్థులు తమపితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విస ర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.

8

1

సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత

2 హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను.

3

తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.౹

4 మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.౹

5 ఇదియుగాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‍హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.౹

6 బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.౹

7 ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలోనుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలోనుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలోనుండియు, శేషించియున్న సకల జనులను

8 ఇశ్రాయేలీయులు నాశనముచేయక వదలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటివరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను.౹

9 అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు; వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుఱ్ఱపు రౌతులకును అధిపతులుగాను నియమించెను.౹

10 వీరిలో శ్రేష్ఠులైన రెండువందల ఏబదిమంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజలమీద అధికారులై యుండిరి.౹

11 ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసముచేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణమునుండి తాను ఆమెకొరకు కట్టించిన నగరునకు రప్పించెను.

12

అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠముమీద దహనబలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణయముచొప్పున

13 మోషే యిచ్చిన ఆజ్ఞనుబట్టి విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, నియామక కాలములయందును, సంవత్సరమునకు ముమ్మారుజరుగు పండుగలయందును, అనగా పులియనిరొట్టెల పండుగయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చెను.౹

14 అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అను దినమున యాజకుల సముఖమున స్తుతిచేయుటకును, ఉప చారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవ జనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.౹

15 ఏ విషయమునుగూర్చియేగాని బొక్కసములనుగూర్చియేగాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణ యమునుబట్టి వారు సమస్తమును జరుపుచువచ్చిరి

16 యెహోవా మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగువరకు సొలొమోను పనియంతయు చేయించెను; అప్పుడు యెహోవా మందిరము సమాప్త మాయెను.

17

సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా

18 హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితోకూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.

9

1

షేబదేశపు రాణి సొలొమోనునుగూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సు లోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.౹

2 సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.౹

3 షేబదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,౹

4 అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను

5 –నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.౹

6 నీ యధిక జ్ఞానమునుగూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.౹

7 నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.౹

8 నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతిన్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.౹

9 ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.౹

10 ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడ కొనివచ్చిరి.౹

11 ఆ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సోపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.౹

12 షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.

13

గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు.౹

14 అరబీదేశపు రాజులందరును దేశాధిపతులును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొని వచ్చిరి.౹

15 రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.౹

16 మరియు సాగగొట్టిన బంగారముతో మూడు వందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకు మూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.౹

17 మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను.౹

18 ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానములును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహములుండెను;౹

19 ఆయారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.౹

20 మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబా నోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితోకూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక

21 సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను

22 రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను.౹

23 దేవుడు సొలొమోనుయొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.౹

24 మరియు ప్రతివాడును ఏటేట వెండివస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను.

25

రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు నాలుగువేల గుఱ్ఱపు సాలలును రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును కలిగి యుండెను.౹

26 యూఫ్రటీసునది మొదలుకొని ఫిలిష్తీయుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకునుఉండు రాజులందరి పైని అతడు ఏలుబడి చేసెను.౹

27 రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను.౹

28 ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను.౹

29 సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శియైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి యున్నది.౹

30 సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను.౹

31 తరువాత సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.

10

1

రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు వెళ్లగా రెహబాము షెకెమునకు పోయెను.౹

2 రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి.౹

3 యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి–నీ తండ్రి మా కాడిని బరువుచేసెను;౹

4 నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవిచేయగా

5 అతడు–మీరు మూడుదినములు తాళి మరల నాయొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి.౹

6 అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను సజీవియై యుండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి–యీ జనులకు నేనేమి ప్రత్యుత్తర మియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా

7 వారు–నీవు ఈ జనులయెడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచిమాటలాడినయెడల వారు ఎప్పటికిని నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి.౹

8 అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసి వేసి, తనతోకూడ పెరిగి తన యెదుటనున్న యౌవనస్థులతో ఆలోచనచేసి

9 –నీ తండ్రి మామీద ఉంచిన కాడిని చులుకన చేయుమని నన్నడిగిన యీ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా

10 అతనితోకూడ పెరిగిన యీ యౌవనస్థులు అతనితో ఇట్లనిరి–నీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగా–నా చిటికెన వ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;౹

11 నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెనుగాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెనుగాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.౹

12 –మూడవ దినమందు నాయొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరును మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా

13 రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి, యౌవనస్థులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి

14 వారికి కఠినమైన ప్రత్యుత్తర మిచ్చెను; ఎట్లనగా–నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను.౹

15 యెహోవా షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించక పోయెను.౹

16 రాజు తాము చేసిన మనవి అంగీకరింపక పోవుట చూచి జనులు–దావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ, నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.౹

17 అయితే యూదాపట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను.౹

18 రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన హదోరమును పంపగా ఇశ్రాయేలువారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను.౹

19 ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.

11

1

రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలోనుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్షయెనుబదివేలమందిని సమకూర్చగా

2 దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

3 –నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను, యూదాయందును బెన్యామీనీయుల ప్రదేశమందునుఉండు ఇశ్రాయేలు వారందరితోను ఈ మాట ప్రకటించుము

4 –ఈ కార్యము నావలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక, బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావునవారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి.

5

రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను.౹

6 [6-9] అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు, శోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీఫు, అదోరయీము, లాకీషు, అజేకా,౹

7

8

9

10 జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి

11 దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.౹

12 మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి.

13

ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీయులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.౹

14 యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.౹

15 యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.౹

16 వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమపితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.౹

17 దావీదును సొలొమోనును నడచిన మార్గమందు మూడు సంవత్సరములువారు నడచి, యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి.

18

రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెను.౹

19 అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి.౹

20 పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయ కాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.౹

21 రెహబాము పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమారులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటెను అబ్షాలోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను.౹

22 రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలచి, అతని సహోదరులమీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను.౹

23 అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను.

12

1

రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన . తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి.౹

2 వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేముమీదికి వచ్చెను.౹

3 అతనితోకూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి.౹

4 అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేమువరకు రాగా

5 ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి–మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.౹

6 అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి.౹

7 వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను.౹

8 అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లువారు అతనికి దాసులగుదురు.

9

ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరు లోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.౹

10 వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరుయొక్క ద్వారమును కాయు సేవకులయొక్క అధిపతులకు అప్పగించెను.౹

11 రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్ల నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి.౹

12 అతడు తన్నుతాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను.

13

రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి యేలుబడి చేసెను; రెహబాము ఏలనారంభించినప్పుడు నలుబదియొక సంవత్సరముల యీడుగల వాడై యుండెను; తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు.౹

14 అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.

15

రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.౹

16 రెహ బామునకును యరొబామునకును యుద్ధము యెడతెగక జరిగెను. రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదుపట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను.

13

1

రాజైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు అబీయా యూదావారిమీద ఏలనారం భించెను.౹

2 అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను; అతని తల్లిపేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె.

3

అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా నాలుగు లక్షలమంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధముచేసెను; యరొబామును ఎనిమిది లక్షలమంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను.౹

4 అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగా — యరొబామా, ఇశ్రాయేలువారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి.౹

5 ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా.౹

6 అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానునిమీద తిరుగుబాటు చేసెను.౹

7 సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి.౹

8 ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధముచేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు; యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి.౹

9 మీరు అహరోను సంతతివారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి, అన్యదేశముల జనులు చేయునట్లు మీకొరకు యాజకులను నియమించు కొంటిరిగదా? ఒక కోడెతోను ఏడు గొఱ్ఱె పొట్టేళ్లతోను తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చు ప్రతివాడు, దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు.౹

10 అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు; మేము ఆయనను విసర్జించిన వారము కాము; అహరోను సంతతివారు యెహోవాకు సేవచేయు యాజకులై యున్నారు; లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు.౹

11 వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టిం చుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాముగాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.౹

12 ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదు నట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీపితరుల దేవుడైన యెహోవాతో యుద్ధముచేయకుడి, చేసినను మీరు జయమొందరు.

13

యరొబాము వారి వెనుకటి భాగమందు మాటు గాండ్రను కొందరిని ఉంచి, సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను.౹

14 యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి.౹

15 అప్పుడు యూదావారు ఆర్భటించిరి; యూదావారు ఆర్భటించి నప్పుడు యరొబామును ఇశ్రాయేలువారందరును అబీయా యెదుటను యూదావారి యెదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున

16 ఇశ్రాయేలువారు యూదా వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారిచేతికి అప్పగించినందున

17 అబీయాయును అతని జనులును వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో అయిదు లక్షలమంది పరాక్రమశాలులు హతులైరి.౹

18 ఈ ప్రకారము ఇశ్రాయేలువారు ఆ కాలమందు తగ్గింపబడిరిగాని యూదావారు తమపితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువుచేత జయమొందిరి.౹

19 అబీయా యరొబామును తరిమి, బేతేలును దాని గ్రామములను యెషానాను దాని గ్రామములను ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను.

20

అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను.౹

21 అబీయా వృద్ధినొందెను, అతడు పదునాలుగు మంది భార్యలను వివాహము చేసికొని యిరువది యిద్దరు కుమారులను పదునారుగురు కుమార్తెలను కనెను.౹

22 అబీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్యనుగూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులనుగూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయ బడియున్నది.

14

1

అబీయా తన పితరులతోకూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.౹

2 ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై

3 అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగుల గొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి

4 వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి

5 ఉన్నతస్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతని యేలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.౹

6 ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుటచేత దేశములో నెమ్మదికలిగియుండెను; యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా అతడు యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించెను.

7

అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెను–మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.౹

8 ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు రెండులక్షల ఎనుబదివేల మంది బెన్యామీనీయులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.౹

9 కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.౹

10 వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా

11 ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి — యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా

12 యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందునవారు పారిపోయిరి.౹

13 ఆసాయును అతనితోకూడనున్నవారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.౹

14 గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరిమీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.౹

15 మరియు వారు పసులసాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

15

1

ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను

2 –ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును,౹

3 నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలాదినములు ఇశ్రాయేలీయులకులేకుండ పోవును.౹

4 తమ శ్రమయందువారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను.౹

5 ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానములేకుండెను.౹

6 దేవుడు జనములను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను.౹

7 కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.

8

ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి

9 యూదా వారినందరిని బెన్యామీనీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైనజనులు అతని పక్షము చేరిరి.౹

10 ఆసా యేలుబడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి

11 తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ములోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడువేల గొఱ్ఱెలను యెహోవాకు బలులుగా అర్పించి

12 పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమపితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదుమనియు

13 పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలేగాని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్షచేసికొనిరి.౹

14 వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.౹

15 ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవావారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములులేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.౹

16 మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.౹

17 ఆసా ఉన్నతస్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదుగాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.౹

18 తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునందుంచెను.౹

19 ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.

16

1

ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇశ్రాయేలురాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా

2 ఆసా యెహోవామందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి, దమస్కులో నివాసముచేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతలచేత పంపించి

3 –నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది, వెండిని బంగారమును నీకు పంపియున్నాను; ఇశ్రాయేలురాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను.౹

4 బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలువారి పట్టణములమీదికి పంపగా వీరు ఈయోనును దానును ఆబేల్మాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి.౹

5 బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను.౹

6 అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను; వీరు పోయి బయెషా కట్టించు చుండిన రామాపట్టణపు రాళ్లను దూలములను తీసికొని వచ్చిరి, వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను.

7

ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను–నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను.౹

8 బహువిస్తారమైన రథములును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతికప్పగించెను.౹

9 తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.౹

10 ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రముచూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.౹

11 ఆసా చేసిన కార్యములన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

12 ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.౹

13 ఆసా తన పితరులతోకూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా

14 అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహువిస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.

17

1

తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన . యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండ తన రాజ్యమును బలపరచుకొనెను.౹

2 అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటియందును సైన్యములను ఉంచి, యూదా దేశమందును తన తండ్రియైన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములయందును కావలి బలములను ఉంచెను.౹

3 యెహోవా అతనికి సహాయుడై యుండగా యెహోషాపాతు తన తండ్రియైన దావీదు ప్రారంభదినములలో నడచిన మార్గమందు నడచుచు

4 బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, ఇశ్రాయేలువారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలననుసరించి నడిచెను.౹

5 కాబట్టి యెహోవా అతనిచేత రాజ్యమును స్థిరపరచెను, యూదావారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వ ర్యమును ఘనతయు మెండుగా కలిగెను.౹

6 యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనినవాడై ఉన్నతస్థలములను దేవతాస్తంభములను యూదాలోనుండి తీసివేసెను.

7

తన యేలుబడియందు మూడవ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును ఓబద్యాను జెకర్యాను నెతనేలును మీకాయాను

8 షెమయా నెతన్యా జెబద్యా అశాహేలు షెమిరామోతు యెహోనాతాను అదోనీయా టోబీయా టోబదోనీయా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను యెహోరామును బంపెను.౹

9 వారు యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చేతపుచ్చుకొని యూదావారిమధ్య ప్రకటనచేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.౹

10 యూదాదేశము చుట్టుఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందునవారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి.౹

11 ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి; అరబీయులును అతనికి ఏడువేల ఏడు వందల గొఱ్ఱె పొట్టేళ్లను ఏడువేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచు వచ్చిరి.

12

యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను.౹

13 యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.౹

14 వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.౹

15 రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండులక్షల ఎనుబదివేలమంది యుండిరి.౹

16 మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.౹

17 బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.౹

18 రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.౹

19 రాజు యూదాయందంతటనుండు ప్రాకారపురములలో ఉంచినవారు గాక వీరు రాజుయొక్క పరివారములో చేరినవారై యుండిరి.

18

1

తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది

2 కొన్ని సంవత్సరములు గతించినమీదట షోమ్రోనులో నుండు అహాబునొద్దకు పోయెను; అహాబు అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేకమైన గొఱ్ఱెలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదు మీదికిపోవుటకు అతని ప్రేరేపించెను.౹

3 ఇశ్రాయేలురాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి–నీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతు–నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతోకూడ యుద్ధమునకు వచ్చెదమని చెప్పెను.౹

4 మరియు యెహోషాపాతు ఇశ్రాయేలురాజుతో–నేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా

5 ఇశ్రాయేలురాజు నాలుగువందలమంది ప్రవక్తలను సమకూర్చి–నేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారు–పొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించునని చెప్పిరి.౹

6 అయితే యెహోషాపాతు–మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా

7 ఇశ్రాయేలురాజు–యెహోవాయొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతు–రాజు ఆలాగనవద్దనెను.౹

8 అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివారములోనున్న యొకని పిలిపించి–ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.౹

9 ఇశ్రాయేలురాజును యూదారాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమతమ వస్త్రములను ధరించుకొని తమతమ సింహాసనములమీద కూర్చునియుండగా ప్రవక్తలందరును వారి ముందర ప్రవచించుచుండిరి.౹

10 అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా యినుపకొమ్ములు చేయించుకొనివచ్చి–సిరియనులు నిర్మూల మగువరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను.౹

11 ప్రవక్తలందరును ఆప్రకారముగానే ప్రవచించుచు–యెహోవా రామో త్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికిపోయి జయమొందుము అనిరి.౹

12 మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని–ప్రవక్తలు రాజు విషయమై యేక ముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవ చింపుమనగా

13 మీకాయా–యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.౹

14 అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి–మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడు–పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను.౹

15 అప్పుడు రాజు–యెహోవా నామమునుబట్టి అబద్ధముకాక సత్యమే పలుకుమని నేను ఎన్నిమారులు నీచేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా

16 అతడు–కాపరిలేని గొఱ్ఱెలవలెనే ఇశ్రాయేలు వారందరును పర్వతములమీద చెదరిపోవుట చూచితిని; —వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన యింటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను.౹

17 ఇశ్రాయేలురాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను —ఇతడు కీడునేగాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని యనగా

18 మీకాయా— యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడైయుండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడిప్రక్కను ఎడమప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని.౹

19 –ఇశ్రాయేలురాజైన అహాబు రామో త్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.౹

20 అప్పుడు ఒక ఆత్మవచ్చి యెహోవాయెదుట నిలువబడి–నేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవా–దేనిచేతనని అతని నడిగెను.౹

21 అందుకు ఆయాత్మ–నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా–నీవు అతనిని ప్రేరేపించి జయిం తువు, పోయి ఆప్రకారముగా చేయుమని సెలవిచ్చెను.౹

22 యెహోవా నీ ప్రవక్తలగు వీరినోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించియున్నాడని చెప్పెను.

23

అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టి–నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏ మార్గమున పోయెననెను.౹

24 అందుకు మీకాయా–దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్లు దినమున దాని తెలిసికొందువని చెప్పెను.౹

25 అప్పుడు ఇశ్రాయేలురాజు–పట్టణపు అధిపతియైన ఆమోనునొద్దకును రాజు కుమారుడైన యోవాషునొద్దకును —మీరు మీకాయాను తీసికొనిపోయి వారితో రాజు మీకిచ్చిన సెలవు ఇదియే యనుడి,౹

26 –నేను సురక్షితముగా తిరిగి వచ్చువరకు వీనిని చెరలోపెట్టి క్లేశాన్న పానములు ఇయ్యుడి.౹

27 అప్పుడు మీకాయా యిట్ల నెను–నీవు సురక్షితముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్తజనులారా ఆలకించుడనెను.౹

28 అంతట ఇశ్రాయేలురాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదుమీదికి పోయిరి.౹

29 ఇశ్రాయేలురాజు–నేను మారువేషమువేసికొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసి కొనెను, తరువాత వారు యుద్ధమునకు పోయిరి.౹

30 సిరియా రాజు–మీరు ఇశ్రాయేలురాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతోకూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను.౹

31 కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి,గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను.౹

32 ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజుకాడని తెలిసికొని అతని తరుముట మాని తిరిగిపోయిరి.౹

33 అప్పుడు ఒకడు గురిచూడకయే తన వింటిని ఎక్కుబెట్టి, ఇశ్రాయేలురాజును అతని కవచపు బందులసందున కొట్టగా అతడు— నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులోనుండి నన్ను కొనిపొమ్మని తన సారధితో అనెను.౹

34 ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రాయేలురాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చని పోయెను.

19

1

యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయమును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా

2 దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటనచేసెను–నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.౹

3 అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.

4

యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను.౹

5 మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికీలాగున ఆజ్ఞాపించెను

6 –మీరు యెహోవా నియమమునుబట్టియేగాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతోకూడనుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్ర త్తగా చేయుడి.౹

7 యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.౹

8 మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణ యించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరులయిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి

9 వారికీలాగున ఆజ్ఞాపించెను–యెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను.౹

10 నరహత్యనుగూర్చియు, ధర్మశాస్త్రమునుగూర్చియు, ధర్మమునుగూర్చియు, కట్టడలనుగూర్చియు, న్యాయవిధులనుగూర్చియు, ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమ ర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లువారు యెహోవాదృష్టికి ఏ అపరాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.౹

11 మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతోకూడ ఉండును.

20

1

ఇది యయిన తరువాత మోయాబీయులును అమ్మోనీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చిరి.౹

2 అంతలో కొందరు వచ్చి–సముద్రము ఆవలనుండు సిరియనులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.౹

3 అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా

4 యూదావారు యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.౹

5 యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి

6 –మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.౹

7 నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.౹

8 వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల

9 నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.౹

10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి.౹

11 మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము.౹

12 మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.౹

13 యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.౹

14 అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటిం చెను

15 –యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.౹

16 రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడుమార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొనదగ్గర వారిని కనుగొందురు.౹

17 ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును.౹

18 అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపురస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి.౹

19 కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతివారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను స్తుతించిరి.౹

20 అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి–యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ము కొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను.౹

21 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు–యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.౹

22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.౹

23 అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.౹

24 యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.౹

25 యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడుదినములు పట్టెను.౹

26 నాల్గవదినమునవారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా లోయ యని పేరు.౹

27 ఈలాగున యెహోవావారి శత్రువులమీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్లిరి;౹

28 వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి.౹

29 ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను.౹

30 ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను.

31

యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సరములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,౹

32 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రియైన ఆసా మార్గమందు నడచుచు దానిలోనుండి తొలగిపోకుండెను.౹

33 అయితే అప్పటి కింకను జనులు తమపితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నతస్థలములను తీసివేయలేదు.౹

34 యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలురాజుల గ్రంథమందు కనబడుచున్నది.౹

35 ఇది యయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలురాజైన అహజ్యాతో స్నేహము చేసెను.౹

36 తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహముచేయగా వారు ఎసోన్గె బెరులో ఆ ఓడలను చేయించిరి.౹

37 అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరు–నీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాలకుండ బద్దలైపోయెను.

21

1

యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించి తన పితరులచెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను.౹

2 యెహోషాపాతు కుమారులైన అజర్యా యెహీయేలు జెకర్యా అజర్యా మిఖాయేలు షెఫట్య అను వారు ఇతనికి సహోదరులు; వీరందరును ఇశ్రాయేలురాజైన యెహోషాపాతు కుమారులు.౹

3 వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తవస్తువులనేకములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను.౹

4 యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని, తన సహోదరులనందరిని ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతముచేసెను.౹

5 యెహోరాము ఏలనారంభించి నప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.౹

6 అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతివారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలురాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.౹

7 అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.౹

8 అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒకరాజును చేసికొనగా

9 యెహోరాము తన చేతిక్రిందనున్న అధికారులను వెంట బెట్టుకొని, తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతముచేసెను.౹

10 కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతనిచేతి క్రిందనుండి తిరుగబడెను.౹

11 మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను .

12

అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెను–నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక

13 ఇశ్రాయేలురాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటె యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు.౹

14 కాబట్టి గొప్ప తెగులుచేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములన్నిటిని మొత్తును.౹

15 నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును.౹

16 మరియు యెహోవా యెహోరాముమీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా

17 వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.౹

18 ఇదియంతయు అయినతరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున

19 రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు.౹

20 అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.

22

1

అరబీయులతోకూడ దండు విడియుచోటికి వచ్చినవారు పెద్దవారినందరిని చంపిరి గనుక యెరూషలేము కాపురస్థులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజునుచేసిరి. ఈ ప్రకారము యూదారాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము బొందెను.౹

2 అహజ్యా యేలనారంభించినప్పుడు నలువది రెండేండ్లవాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను; అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా

3 దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతివారి మార్గములందు నడచెను.౹

4 అహాబు సంతతివారివలెనే అతడు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశమునకు కారకులైరి.౹

5 వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి, రామోత్గిలాదులో సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజగు యెహోరాముతోకూడ పోయెను; సిరియనులచేత యెహోరామునకు గాయములు తగిలెను.౹

6 సిరియారాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగుచేసికొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలి వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగియైయున్నాడని విని యూదా రాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను.౹

7 యెహోరాము నొద్దకు అతడు వచ్చుటచేత దేవునివలన అతనికి నాశము కలిగెను; ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతివారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీకుమారుడైన యెహూమీదికి అతడు యెహోరాముతోకూడ పోగా

8 యెహూ అహాబు సంతతివారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను.౹

9 అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటివారు ఇక నెవరును లేకపోయిరి.

10

అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు చనిపోయె నని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశజులనందరిని హతము చేసెను.౹

11 అయితే రాజునకు కుమార్తెయైన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలోనుండి దొంగిలించి, అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండ అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంప లేకపోయెను; ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి.౹

12 ఆరుసంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిరములో దాచబడియుండెను; ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను.

23

1

అంతట ఏడవ సంవత్సరమందు యెహోయాదా. ధైర్యము తెచ్చుకొని, శతాధిపతులతోను యెరోహాము కుమారుడైన అజర్యాతోను యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను అదాయా కుమారుడైన మయశేయాతోను జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోను నిబంధనచేయగా

2 వారు యూదా దేశమందంతటను సంచరించి, యూదావారి పట్టణములన్నిటిలోనుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరులయిండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి.౹

3 జనులందరు సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసికొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను–యెహోవా దావీదు కుమారులనుగూర్చి యిచ్చిన సెలవుచొప్పున రాజకుమారుడు రాజ్య మేలవలెను.౹

4 కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైనవారేమి లేవీయులైనవారేమి విశ్రాంతిదినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై, యొక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను.౹

5 ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను. ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలెను, జనులందరు యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను.౹

6 యాజకులును లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరును రాకూడదు, వారు ప్రతిష్ఠింపబడినవారు గనుక వారు లోపలికి రావచ్చునుగాని జనులందరు యెహోవా ఇచ్చిన ఆజ్ఞచొప్పున బయట ఉండవలెను.౹

7 లేవీయులందరు తమతమ ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టును ఉండవలెను, మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చినయెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడి; రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్లునప్పుడేమి మీరు అతనితోకూడ ఉండవలెను.౹

8 కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్ల వలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను.

9

మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను.౹

10 అతడు ఆయుధము చేతపట్టుకొనిన జనులందరిని మందిరపు కుడివైపునుండి యెడమవైపువరకు బలిపీఠము ప్రక్కను మందిరముప్రక్కను రాజుచుట్టును ఉంచెను.౹

11 అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మశాస్త్ర గ్రంథమును అతనిచేతికిచ్చి అతనికి పట్టాభి షేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించి–రాజు చిరంజీవియగునుగాక యనిరి.

12

పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులుచేయు ధ్వని అతల్యా విని యెహోవామందిరమందున్న జనులయొద్దకు వచ్చి

13 ప్రవేశస్థలముదగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడియుండుటయు, అధిపతులును బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు, దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులును వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని–ద్రోహము ద్రోహమని అరచెను.౹

14 అప్పుడు యాజకుడైన యెహోయాదా–యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకొనివెళ్ళి ఆమె పక్షము పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యముమీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.౹

15 కాబట్టి వారు ఆమెకు దారియిచ్చి, రాజనగరునొద్దనున్న గుఱ్ఱపు గుమ్మముయొక్క ప్రవేశస్థలమునకు ఆమె వచ్చి నప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి.౹

16 అప్పుడు యెహోయాదా జనులందరు యెహోవావారై యుండవలెనని జనులందరితోను రాజుతోను నిబంధనచేసెను.౹

17 అంతట జనులందరును బయలుదేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి, బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి, బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి.౹

18 మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవామందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.౹

19 యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలినవారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వారపాలకులను ఉంచెను.౹

20 మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులనందరిని వెంటబెట్టుకొని యెహోవా మందిరములోనుండి రాజును తోడుకొని వచ్చెను; వారు ఎత్తయిన ద్వారముగుండ రాజ నగరుచొచ్చి రాజ్యసింహాసనముమీద రాజును ఆసీనునిచేయగా

21 దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.

24

1

యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్స. రముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేర్షెబా కాపురస్థురాలైన జిబ్యా.౹

2 యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.

3

యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లి చేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను.౹

4 అంతట యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక

5 అతడు యాజకులను లేవీయులను సమకూర్చి–మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగుచేయుటకై ఇశ్రాయేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయి నందున

6 రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచి–ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి, యెహోవామందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల నన్నిటిని బయలుదేవతపూజకు ఉప యోగించిరి.౹

7 సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకై యూదాలోనుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజముచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను.౹

8 కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పునవారు ఒక పెట్టెను చేయించి యెహోవామందిరద్వారము బయట ఉంచిరి.౹

9 మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.౹

10 కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.౹

11 లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధానమంత్రియు ప్రధానయాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలుమారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.౹

12 అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.౹

13 ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.౹

14 అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును, దహనబలులనర్పించుటయందు ఉపయోగపడునట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.

15

యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చని పోయెను; అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్ల వాడు.౹

16 అతడు ఇశ్రాయేలీయులలో దేవునిదృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతిపెట్టిరి.౹

17 యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను.౹

18 జనులు తమపితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు చేసిన యీ యప రాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.౹

19 తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవావారియొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారిమీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి.౹

20 అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి–మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.౹

21 అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి.౹

22 ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు–యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.

23

ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను; వారు యూదాదేశముమీదికిని యెరూషలేముమీదికిని వచ్చి, శేషములేకుండ జనుల అధిపతుల నందరిని హతముచేసి, తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి.౹

24 సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవావారి చేతికి అతివిస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను.౹

25 వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియైయుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరిగాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.౹

26 అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు.౹

27 అతని కుమారులనుగూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులనుగూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయుటనుగూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి యున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.

25

1

అమజ్యా యేలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యిరువది తొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థు రాలు, ఆమె పేరు యెహోయద్దాను.౹

2 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెనుగాని పూర్ణహృదయముతో ఆయనను అనుసరింపలేదు.౹

3 రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను.౹

4 అయితే–తండ్రులు పిల్లలకొరకును పిల్లలు తండ్రులకొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపముకొరకు తానే చావవలెనని మోషే గ్రంథ మందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న యెహోవా ఆజ్ఞనుబట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను.

5

అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారివారి పితరులయిండ్లనుబట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు మూడులక్షలమంది కనబడిరి.౹

6 మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండి లక్షమంది పరాక్రమశాలులను రెండువందల మణుగుల వెండికి కుదిర్చెను.౹

7 దైవజనుడైన యొకడు అతనియొద్దకు వచ్చి–రాజా, ఇశ్రాయేలువారి సైన్యమును నీతోకూడ తీసికొనిపోవద్దు, యెహోవా ఇశ్రాయేలువారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు.౹

8 ఆలాగు పోవలెనని నీకున్నయెడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును; నిలువబెట్టుటయు పడవేయు టయు దేవునివశమేగదా అని ప్రకటింపగా

9 అమజ్యా దైవజనుని చూచి–ఇశ్రాయేలువారి సైన్యమునకు నేనిచ్చిన రెండువందల మణుగుల వెండికి ఏమి చేసెదమని అడిగినందుకు–దీనికంటె మరి యధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను.౹

10 అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములోనుండి తనయొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరచి–మీ యిండ్లకు తిరిగి వెళ్లు డని వారికి సెలవిచ్చెను; అందుకు వారి కోపము యూదావారిమీద బహుగా రగులుకొనెను, వారు ఉగ్రులై తమ యిండ్లకు తిరిగి పోయిరి.౹

11 అంతట అమజ్యా ధైర్యము తెచ్చుకొని తన జనులతోకూడ బయలుదేరి ఉప్పుపల్లపు స్థలమునకు పోయి శేయీరువారిలో పదివేలమందిని హతము చేసెను.౹

12 ప్రాణముతోనున్న మరి పదివేలమందిని యూదావారు చెరపట్టుకొని, వారిని ఒక పేటుమీదికి తీసికొనిపోయి ఆ పేటుమీదనుండి వారిని పడవేయగా వారు తుత్తునియలైపోయిరి.౹

13 అయితే తనతోకూడ యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్‌హోరోనువరకు ఉన్న యూదాపట్టణములమీదపడి వారిలో మూడు వేలమందిని హతముచేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకొనిపోయిరి.

14

అమజ్యా ఎదోమీయులను ఓడించితిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరువారి దేవతలను తీసికొనివచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను.౹

15 అందుకొరకు యెహోవా కోపము అమజ్యామీద రగులుకొనెను. ఆయన అతనియొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు–నీ చేతిలోనుండి తమ జనులను విడిపింప శక్తిలేని దేవతలయొద్ద నీవెందుకు విచారణ చేయుదువని అమజ్యాతోననెను.౹

16 అతడు అమజ్యాతో మాటలాడుచుండగా రాజు అతని చూచి–నీవు రాజుయొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకొనుము; నేను నిన్ను చంపనేల అని చెప్పగా ఆ ప్రవక్త–నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించియున్నాడని నాకు తెలియునని చెప్పి యూరకొనెను.

17

అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచనచేసికొని —రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలురాజునైన యెహోయాషునొద్దకు వర్తమానము పంపెను.౹

18 కాగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు తిరుగ వర్తమానము పంపెను–నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులో నున్న ముండ్లచెట్టు లెబానోనులోనున్న దేవదారువృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో సంచరించు ఒక దుష్టమృగము ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.౹

19 –నేను ఎదోమీయులను ఓడించితిని గదా యని నీవను కొనుచున్నావు; నీ హృదయము నీవు గర్వించి ప్రగ ల్భము లాడునట్లు చేయుచున్నది; యింటియొద్ద నిలిచి యుండుము; నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట యెందుకు? నీవును నీతోకూడ యూదావారును అపజయ మొందుట యెందుకు?

20 జనులు ఎదోమీయుల దేవతలయొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడునట్లు దేవుని ప్రేరణవలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపక పోయెను.౹

21 ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బేత్షెమెషులో అతడును యూదా రాజైన అమజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి.౹

22 యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక ఓడిపోగా ప్రతివాడును తన తన గుడారమునకు పారిపోయెను.౹

23 అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చి, యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మమువరకు నాలుగువందల మూరల పొడుగున పడ గొట్టెను.౹

24 అతడు దేవుని మందిరములో ఓబేదెదోము నొద్దనున్న వెండియంతయు బంగారమంతయు ఉపకరణములన్నియు రాజు నగరునందున్న సొమ్మును కుదవపెట్ట బడినవారిని తీసికొని షోమ్రోనునకు తిరిగి వెళ్లెను.

25

ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా పదునయిదు సంవత్సరములు బ్రదికెను.౹

26 అమజ్యా చేసిన యితర కార్యములు యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నవి.౹

27 అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతనిమీద కుట్రచేయగా అతడు లాకీషునకు పారి పోయెను.౹

28 అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతని అక్కడ చంపి, గుఱ్ఱములమీద అతని శవము ఎక్కించి తీసికొనివచ్చి యూదాపట్టణమందు అతని తండ్రులయొద్ద అతని పాతిపెట్టిరి.

26

1

అంతట యూదా జనులందరును పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి.౹

2 అతడు ఏలతును కట్టించి, రాజగు తన తండ్రి అతని పితరులతోకూడ నిద్రించిన తరువాత అది యూదావారికి తిరిగి వచ్చునట్లు చేసెను.

3

ఉజ్జియా యేలనారంభించినప్పుడు పదునారేండ్లవాడై యెరూషలేములో ఏబది రెండు సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు, ఆమె పేరు యెకొల్యా.౹

4 అతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.౹

5 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను.౹

6 అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను.౹

7 ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధముచేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.౹

8 అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను.౹

9 మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను.౹

10 అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి.

11

యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను; అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతిక్రిందనుండిరి. ఖజానాదారుడగు మయ శేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై యుండిరి.౹

12 వారి పితరులయిండ్ల పెద్దల సంఖ్యనుబట్టి పరాక్రమశాలులు రెండువేల ఆరువందలమంది యైరి.౹

13 రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరుపొందిన పరాక్రమశాలు లైన మూడులక్షల ఏడువేల ఐదువందలమందిగల సైన్యము వారి చేతిక్రింద ఉండెను.౹

14 ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను.౹

15 మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయ శాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.

16

అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహముచేయగా

17 యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబదిమందియు అతని వెంబడి లోపలికి పోయిరి.౹

18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి —ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా

19 ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠముప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.౹

20 ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికి వెళ్లుటకు తానును త్వరపడెను.౹

21 రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియైయుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.౹

22 ఉజ్జియా చేసిన యితర కార్యములనుగూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయా వ్రాసెను.౹

23 ఉజ్జియా తన పితరులతోకూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధమైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.

27

1

యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది. యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను; అతని తల్లి సాదోకు కుమార్తె; ఆమె పేరు యెరూషా.౹

2 యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్యయంతటి ప్రకారముచేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను; అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.౹

3 అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను.౹

4 మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.౹

5 అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.౹

6 ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను.౹

7 యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు, అతని చర్యనుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

8 అతడు ఏలనారం భించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను.౹

9 యోతాము తన పితరులతోకూడ నిద్రించెను; అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను.

28

1

ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది సంవత్సరములవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు.౹

2 అతడు ఇశ్రాయేలురాజుల మార్గములందు నడచి, బయలుదేవతా రూపములుగా పోతవిగ్రహములను చేయించెను.౹

3 మరియు అతడు బెన్‌హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.౹

4 అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.౹

5 అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజుచేతి కప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి. అతడును ఇశ్రాయేలురాజుచేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను.

6

రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువదివేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను.౹

7 పరాక్రమ శాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభాముఖ్యుడైన అజ్రీకామును ప్రధానమంత్రియైన ఎల్కొనానును హతము చేసెను.౹

8 ఇదియుగాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షలమందిని చెరతీసికొనిపోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.౹

9 యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికిపోయి వారితో ఈలాగు చెప్పెను–ఆలకించుడి, మీపితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను; మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి.౹

10 ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్థులను మీకొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరచుకొన దలచియున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా?

11 యెహోవా మహోగ్రత మీమీద రేగియున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలోనుండి మీరు చెరపెట్టిన వీరిని విడచి పెట్టుడి.

12

అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా షల్లూము కుమారుడైన యెహిజ్కియా హద్లాయి కుమారుడైన అమాశా అనువారు యుద్ధమునుండి వచ్చినవారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి

13 –యెహోవా మన మీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపెట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపుజేయుటకు మీరు పూనుకొని యున్నారు; మన అపరాధము అధికమై యున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.౹

14 కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపెట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.౹

15 పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపెట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహోదరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరలి వెళ్లిరి.

16

ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా

17 రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.౹

18 ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.౹

19 ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలురాజైన ఆహాజు చేసిన దానినిబట్టి యూదావారిని హీనపరచెను.౹

20 అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనేగాని అతని బలపరచలేదు.౹

21 ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతులయొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెనుగాని అతడు అతనికి సహాయము చేయలేదు.౹

22 ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.౹

23 ఎట్లనగా–సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.౹

24 ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతట బలిపీఠములను కట్టించెను.౹

25 యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.౹

26 అతడుచేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్యయంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

27 ఆహాజు తన పితరులతోకూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.

29

1

హిజ్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యిరువదితొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా.౹

2 అతడు తన పితరుడగు దావీదు చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.౹

3 అతడు తన యేలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి,౹

4 యాజకులను లేవీయులను పిలువనంపి, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి

5 వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను–లేవీయులారా, నా మాట ఆలకించుడి; ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, మీపితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములోనుండి నిషిద్ధ వస్తువుల నన్నిటిని బయటికి కొనిపోవుడి.౹

6 మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడ ముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.౹

7 మరియు వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి.౹

8 అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూషలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగాచేసెను.౹

9 కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.౹

10 ఇప్పుడు మనమీద నున్న ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను.౹

11 నా కుమారులారా, తనకు పరిచారకులైయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధచేయకుడి.

12

అప్పుడు కహాతీయులలో అమాశై కుమారుడైన మహతు అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు యోవాహు కుమారుడైన ఏదేను

13 ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రీ యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా మత్తన్యా

14 హేమాను సంతతివారిలో యెహీయేలు షిమీ, యెదూతూను సంతతివారిలో షెమయా ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి.౹

15 వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలనుబట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి.౹

16 పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధవస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసికొనిరాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి.౹

17 మొదటి నెల మొదటి దినమునవారు ప్రతిష్ఠచేయ నారంభించి, ఆ నెల యెనిమిదవదినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు ఎనిమిది దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల పదునారవదినమున సమాప్తి చేసిరి.

18

అప్పుడు వారు రాజైన హిజ్కియాయొద్దకు పోయి— మేము యెహోవామందిరమంతటిని దహనబలిపీఠమును ఉపకరణములన్నిటిని సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరచియున్నాము.౹

19 మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహముచేసి పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరచి ప్రతిష్ఠించియున్నాము, అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి.

20

అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడలేచి, పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను.౹

21 రాజ్యముకొరకును పరిశుద్ధస్థలముకొరకును యూదావారికొరకును పాపపరిహారార్థబలి చేయుటకై యేడు కోడెలను ఏడు పొట్టేళ్లను ఏడు గొఱ్ఱెపిల్లలను ఏడు మేకపోతులను వారు తెచ్చియుంచిరి గనుక అతడు —యెహోవా బలిపీఠముమీద వాటిని అర్పించుడని అహరోను సంతతివారగు యాజకులకు ఆజ్ఞాపించెను.౹

22 పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసికొని బలిపీఠముమీద ప్రోక్షించిరి. ఆప్రకారము వారు పొట్లేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి. వారు గొఱ్ఱెపిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి.౹

23 పాపపరిహారార్థబలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమ చేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి

24 ఇశ్రాయేలీయులందరికొరకు దహనబలియు పాపపరిహారార్థబలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి యుండెను గనుక, ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయ శ్చి త్తము చేయుటకై బలిపీఠముమీద వాటి రక్తమును పోసి, పాపపరిహారార్థబలి అర్పించిరి.౹

25 మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను.౹

26 దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులును బూరలు ఊదుటకు యాజకులును నియమింపబడిరి.౹

27 బలిపీఠముమీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి యర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలురాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను.౹

28 అంత సేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదముచేయుచుండిరి, దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.౹

29 వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్నవారందరును తమ తలలు వంచి ఆరాధించిరి.౹

30 –దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులును లేవీయులకు ఆజ్ఞా పింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి.

31

అంతట హిజ్కియా — మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి; దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొనిరండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొని వచ్చిరి, దహనబలులనర్పించుటకు ఎవరికి ఇష్టముపుట్టెనో వారు దహనబలిద్రవ్యములను తీసికొని వచ్చిరి.౹

32 సమాజపువారు తీసికొని వచ్చిన దహనబలి పశువులెన్నియనగా, డెబ్బది కోడెలును నూరు పొట్టేళ్లును రెండువందల గొఱ్ఱెపిల్లలును; ఇవియన్నియు యెహోవాకు దహనబలులుగా తేబడెను.౹

33 ప్రతిష్ఠింపబడినవి ఆరువందల ఎద్దులును మూడువేల గొఱ్ఱెలును.౹

34 యాజకులు కొద్దిగా ఉన్నందునవారు ఆ దహనబలి పశువులన్నిటిని ఒలువలేకపోగా, పని సంపూర్ణమగువరకు కడమయాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొనువరకు వారి సహోదరులగు లేవీయులు వారికి సహాయము చేసిరి; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు యాజకులకంటె లేవీయులు యథార్థహృదయులై యుండిరి.౹

35 సమాధానబలి పశువుల క్రొవ్వును దహనబలి పశువులును దహనబలులకు ఏర్పడిన పానార్పణలును సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవామందిరసేవ క్రమముగా జరిగెను.౹

36 ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచినదానిని చూచి హిజ్కియాయును జనులందరును సంతోషించిరి.

30

1

మరియు హిజ్కియా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను.౹

2 సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుటచేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా

3 రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవనెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.౹

4 ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను.౹

5 కావున బహుకాలమునుండి వారు వ్రాయ బడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దానువరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయముచేసిరి.౹

6 కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలుదేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి–ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును.౹

7 తమపితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా ప్రవర్తించిన మీపితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను.౹

8 మీపితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపర చిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగి పోవునట్లు ఆయనను సేవించుడి.౹

9 మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములుగలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్ను డగును.

10

అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరిగాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహ సించిరి.౹

11 అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశములవారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.౹

12 యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.౹

13 కావున రెండవనెలయందు పులియని రొట్టెలపండుగ ఆచరించుటకై అతివిస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి.౹

14 వారు దాని చేపెట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి, కిద్రోను వాగులో వాటిని పారవేసిరి.౹

15 రెండవనెల పదునాల్గవదినమునవారు పస్కాపశువును వధించిరి; యాజకులును లేవీయులును సిగ్గునొంది, తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసికొని వచ్చిరి.౹

16 దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధినిబట్టి వారు తమ స్థలమందు నిలువబడగా, యాజకులు లేవీయుల చేతిలోనుండి రక్తమును తీసికొని దానిని ప్రోక్షించిరి.౹

17 సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకు లుండుటచేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కాపశువులను వధించుపని లేవీయుల కప్పగింపబడెను.౹

18 ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా

19 పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా

20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.౹

21 యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోష భరితులై పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు ఉండిరి.౹

22 యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమపితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.౹

23 యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱెల నిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱెల నిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు

24 సమాజపు వారందరును చూచి నప్పుడు, మరి ఏడు దినములు పండుగ ఆచరింపవలెనని యోచనచేసికొని మరి ఏడు దినములు సంతోషముగా దాని ఆచరించిరి.౹

25 అప్పుడు యాజకులును లేవీయులును యూదావారిలోనుండియు ఇశ్రాయేలువారిలోనుండియు వచ్చిన సమాజపువారందరును, ఇశ్రాయేలుదేశములోనుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులును సంతోషించిరి.౹

26 యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనం దము కలిగెను. ఇశ్రాయేలురాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి యుండలేదు.౹

27 అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.

31

1

ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న . ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదాదేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి; తరువాత ఇశ్రాయేలువారందరును తమతమ పట్టణములలోనున్న తమతమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లిరి

2 అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధానబలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారములయొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను.౹

3 మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయ బడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.౹

4 మరియు యెహోవా ధర్మశాస్త్రమునుబట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్య వలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను.౹

5 ఆయాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.౹

6 యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలువారును యూదావారును ఎద్దులలోను గొఱ్ఱెలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి.౹

7 వారు మూడవ మాసమందు కుప్పలువేయ నారంభించి ఏడవ మాసమందు ముగించిరి.౹

8 హిజ్కియాయును అధిపతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి.౹

9 హిజ్కియా ఆ కుప్పలనుగూర్చి యాజకులను లేవీయులను ఆలోచన యడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధానయాజకుడునగు అజర్యా

10 –యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులు చున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా

11 హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.౹

12 వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవభాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింప బడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.౹

13 మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియా వలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యా వలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతి క్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కని పెట్టువారై యుండిరి.౹

14 తూర్పుతట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైనవాటిని పంచి పెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీద నియమింపబడెను.౹

15 అతనిచేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి.౹

16 ఇదియుగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికిని, వంతులచొప్పున సేవచేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చువారందరికిని,౹

17 ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై వంతుల చొప్పున సేవచేయుటకు తమతమపితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు,౹

18 అనగా నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీ యులకును, తమ పిల్లలతోను భార్యలతోను కుమారులతోను కుమార్తెలతోను

19 సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.౹

20 హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.౹

21 తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.

32

1

రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత . అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొర బడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.౹

2 సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధముచేయనుద్దేశించియున్నాడని హిజ్కియాచూచి

3 పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి, తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి.౹

4 –బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుక నేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారు చున్న కాలువను అడ్డిరి.౹

5 మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగుచేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.౹

6 జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను

7 –మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితోకూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.౹

8 మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.

9

ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగ మంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను

10 –అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా— దేని నమ్మి మీరు ముట్టడివేయబడియున్న యెరూషలేములో నిలుచుచున్నారు?

11 కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపుటకై–మన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలోనుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా?

12 ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసి వేసినవాడుకాడా?

13 నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?

14 మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింపగలిగిన దేవుడొకడైన యుండెనా?

15 కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి, యే జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలోనుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.౹

16 అతని సేవకులు దేవుడైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.౹

17 అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింపలేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింప లేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను.౹

18 అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి.౹

19 మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.

20

రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా

21 యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.౹

22 ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున

23 అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందువలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.

24

ఆ దినములలో హిజ్కియా రోగియై మరణదశలో నుండెను. అతడు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన యొకటి దయచేసెను.౹

25 అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా

26 హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనులమీదికి రాలేదు.౹

27 హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.౹

28 ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.౹

29 మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను.౹

30 ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.౹

31 అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటనుగూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను.

32

హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది.౹

33 హిజ్కియా తన పితరులతోకూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమియందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.

33

1

మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబది యయిదు సంవత్సరములు ఏలెను.౹

2 ఇతడు ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా వెళ్లగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడునడత నడచెను.౹

3 ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను.౹

4 మరియు–నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమునుగూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవామందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను.౹

5 మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.౹

6 బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యముచేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను.౹

7 [7-8] —ఇశ్రాయేలీయుల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను, నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడచుకొనుటకై వారు జాగ్రత్తపడినయెడల, మీపితరులకు నేను ఖాయపరచిన దేశమునుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను.౹

8

9 ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చిన వాడై, ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.

10

యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.౹

11 కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.౹

12 అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని

13 ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.

14

ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మమువరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.౹

15 మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవామందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను.౹

16 ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి, దానిమీద సమాధానబలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను.౹

17 అయినను జనులు ఉన్నతస్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి.౹

18 మనష్షే చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు దేవునికి పెట్టిన మొరలనుగూర్చియు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలనుగూర్చియు, ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

19 అతడు చేసిన ప్రార్థననుగూర్చియు, అతని మనవి వినబడుటనుగూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణపడకముందు ఉన్నతస్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను అచ్చట నిలుపుటనుగూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.౹

20 మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.

21

ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను.౹

22 అతడు తన తండ్రియైన మనష్షే నడచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; తన తండ్రియైన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికి బలులు అర్పించుచు పూజించుచు

23 తన తండ్రియైన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను.౹

24 అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా

25 దేశ జనులు ఆమోను రాజుమీద కుట్రచేసిన వారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.

34

1

యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరము ఏలెను.౹

2 అతడు యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగకుండ తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.౹

3 తన యేలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను.౹

4 అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి, వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి, దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటికి బలులు అర్పించినవారి సమాధులమీద చల్లి వేసిరి.౹

5 బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను.౹

6 ఆప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును, చుట్టుపెట్లనున్న పాడుస్థలములన్నిటను బలిపీఠములను పడ గొట్టెను.౹

7 బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కినవిగ్రహములను చూర్ణముచేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను.

8

అతని యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున, దేశమును మందిరమును పవిత్రపరచుటయైన తరువాత, అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతియైన మయశేయాను, రాజ్యపు దస్తావేజులమీదనున్న యోహాహాజు కుమారుడగు యోవాహాజును, తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను.౹

9 వారు ప్రధానయాజకుడైన హిల్కీయాయొద్దకు వచ్చి, ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశములయందు ఇశ్రాయేలువారిలో శేషించియున్న వారందరియొద్దనుండియు, యూదా బెన్యామీనీయులందరి యొద్దనుండియుకూర్చి, దేవుని మందిరములోనికి తీసికొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి.౹

10 వారు దానిని యెహోవా మందిరపు పనిమీదనున్న పైవిచారణకర్తల కియ్యగా, దాని బాగుచేయుటకును, యూదారాజులు పాడుచేసిన యిండ్లకు దూలములను అమర్చుటకును

11 చెక్కిన రాళ్లను జోడింపుపనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయువారికిని శిల్పకారులకును దాని నిచ్చిరి.౹

12 ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారిమీది పైవిచారణకర్తలు ఎవరనగా, మెరా రీయులైన లేవీయులగు యహతు ఓబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జెకర్యా మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్యప్రవీణులైనవారు వారితోకూడ ఉండిరి.౹

13 మరియు బరువులు మోయు వారిమీదను, ప్రతివిధమైన పని జరిగించువారిమీదను ఆ లేవీయులు పైవిచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులును పరిచారకులును ద్వారపాలకులు నైనవారు ఆయా పనులమీద నియమింపబడిరి.౹

14 యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగలగ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను.౹

15 అప్పుడు హిల్కీయా–యెహోవామందిరమందు ధర్మశాస్త్రముగలగ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను.౹

16 షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసికొనిపోయి రాజుతో ఇట్లనెను–నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు.౹

17 యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పైవిచారణ కర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు.౹

18 మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవిచేసికొని, శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దానినుండి చదివి వినిపించెను.౹

19 అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని

20 హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను

21 — మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించియున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.

22

అప్పుడు హిల్కీయాయును రాజు నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణకర్తయునగు షల్లూముయొక్క భార్యయైన హుల్దా అను ప్రవక్తియొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుప భాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా

23 ఆమె వారితో ఇట్లనెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా

24 –ఆలకించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పించెదను.౹

25 వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులవలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నాకోపము ఈ స్థలముమీద మితిలేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి.౹

26 మరియు యెహోవాయొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి–నీవు ఎవనిమాటలు విని యున్నావో ఇశ్రాయేలీయులదేవుడైన ఆ యెహోవా సెలవిచ్చునదేమనగా

27 –నీ మనస్సు మెత్తనిదై యీ స్థలముమీదను దాని కాపురస్థులమీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని.౹

28 నేను నీ పితరులయొద్ద నిన్ను చేర్చుదును; నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు; ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులార చూడవు.

29

వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువనంపించి

30 వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరును, యెరూషలేము కాపురస్థులును, యాజకులును, లేవీయులును, జనులలో పిన్నపెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నియు వారికి వినిపింపబడెను.౹

31 పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి —నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదు నని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.౹

32 మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరిని బెన్యామీనీయులనందిరిని అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను గనుక యెరూషలేము కాపురస్థులు తమపితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి.౹

33 మరియు యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలోనుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి, ఇశ్రాయేలీయులందరును తమ దేవుడైన యెహోవాను సేవించునట్లు చేసెను. అతని దినములన్నియు వారు తమపితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.

35

1

మరియు యోషీయా యెరూషలేమునందు యెహోవాకు పస్కాపండుగ ఆచరించెను. మొదటి నెల పదునాల్గవదినమున జనులు పస్కాపశువును వధించిరి.౹

2 అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి, యెహోవామందిరసేవను జరిగించుటకై వారిని ధైర్య పరచి

3 ఇశ్రాయేలీయులకందరికి బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజములమీద మోయక, ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి, మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి.౹

4 ఇశ్రాయేలీయుల రాజైన దావీదు వ్రాసియిచ్చిన క్రమముచొప్పు నను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ మీపితరులయిండ్లకు ఏర్పాటైన వరుసలనుబట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి.౹

5 జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి, వారి వారి పితరుల కుటుంబముల వరుసలనుబట్టి జనులైన మీ సహోదరులకొరకు సేవచేయుడి.౹

6 ఆప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతి ష్ఠించుకొని, మోషేద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞలను అనుసరించి, దానిని మీ సహోదరులకొరకు సిద్ధపరచుడి.౹

7 మరియు యోషీయా తన స్వంత మందలో ముప్పది వేల గొఱ్ఱెపిల్లలను మేకపిల్లలను మూడువేల కోడెలను అక్కడ నున్న జనులకందరికి పస్కాపశువులుగా ఇచ్చెను.౹

8 అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరువందల గొఱ్ఱెలను మూడువందల కోడెలను ఇచ్చిరి.౹

9 కొనన్యాయు, అతని సహోదరులైన షెమయాయు, నెతనేలును, లేవీయులలో నధిపతులగు హషబ్యాయు, యెహీయేలును యోజాబాదును పస్కాపశువులుగా లేవీయులకు అయిదువేల గొఱ్ఱెలను ఐదువందల కోడెలను ఇచ్చిరి.౹

10 ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి.౹

11 లేవీయులు పస్కాపశువులను వధించి రక్తమును యాజకుల కియ్యగా వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలువగా

12 మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసికొనిరి.౹

13 వారు ఎడ్లను కూడ ఆప్రకారముగానే చేసిరి. వారు విధిప్రకారము పస్కాపశు మాంసమును నిప్పుమీద కాల్చిరిగాని యితరమైన ప్రతిష్ఠార్పణలనుకుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికి త్వరగా వడ్డించిరి.౹

14 తరువాత లేవీయులు తమకొరకును యాజకులకొరకును సిద్ధముచేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశుమాంసమును క్రొవ్వును రాత్రివరకు అర్పింపవలసివచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతివారగు యాజకులకొరకును సిద్ధపరచిరి.౹

15 మరియు ఆసాపు సంతతివారగు గాయకులును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి; ద్వారములన్నిటియొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.౹

16 ఈ ప్రకారము రాజైన యోషీయా యిచ్చిన ఆజ్ఞనుబట్టి వారు పస్కా పండుగ ఆచరించి, యెహోవా బలిపీఠముమీద దహనబలులను అర్పించుటచేత ఆ దినమున ఏమియు లోపములేకుండ యెహోవా సేవ జరిగెను.౹

17 అక్కడ నున్న ఇశ్రాయేలీయులు, ఆ కాలమందు పస్కాను పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి.౹

18 ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయులును, అక్కడనున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూషలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలురాజులందరిలో ఒక్కడైనను పస్కాపండుగను ఆచరించి యుండలేదు.౹

19 యోషీయా యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కాపండుగ జరిగెను.

20

ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిరమును సిద్ధపరచినప్పుడు ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నదియొద్దనున్న కర్కెమీషుమీదికి దండెత్తి వెళ్లుచుండగా యోషీయా అతనిమీదికి బయలుదేరెను.౹

21 అయితే రాజైన నెకో అతనియొద్దకు రాయబారులను పంపి— యూదారాజా నీతో నాకేమి? పూర్వమునుండి నాకు శత్రువులగువారిమీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతోకూడ ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దనిచెప్ప నాజ్ఞా పించెను.౹

22 అయినను యోషీయా అతనితో యుద్ధము చేయగోరి, అతనియొద్దనుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని, యెహోవా నోటిమాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయ వచ్చెను.౹

23 విలుకాండ్రు రాజైన యోషీయామీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి–నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్ను కొని పోవుడని చెప్పెను.౹

24 కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.౹

25 యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.౹

26 యోషీయా చేసిన యితర కార్యములన్నిటిని గూర్చియు, యెహోవా ధర్మశాస్త్రవిధులననుసరించి అతడు చూపిన భయభక్తులనుగూర్చియు,౹

27 అతడు చేసిన సమస్త క్రియలనుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

36

1

అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.౹

2 యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు నెలలు ఏలెను.౹

3 ఐగుప్తురాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి

4 అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించి, అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసికొని పోయెను.

5

యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుటచేత

6 అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొని పోవుటకై గొలుసులతో బంధించెను.౹

7 మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసికొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను.౹

8 యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటనుగూర్చియు, అతని సకల ప్రవర్తననుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను.

9

యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను

10 ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహోదరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను.

11

సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొక టేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను.౹

12 అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్నుతాను తగ్గించుకొనకయు ఉండెను.౹

13 మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.౹

14 అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.౹

15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షముగలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచువచ్చినను

16 వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.౹

17 ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతికప్ప గించెను.౹

18 మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.౹

19 అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి.౹

20 ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనేయుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.౹

21 యిర్మీయాద్వారా పలుక బడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతిదినముల ననుభవించెను.

22

పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపురాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

23 –పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞా పించునదేమనగా–ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవావారికి తోడుగా నుండునుగాక.