1
అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.౹2 అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై–మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి–ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా
3 యెహోవాదూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను–నీవులేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము–ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా?
4 కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవెక్కిన మంచము మీదనుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను.౹
5 తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. —మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా
6 వారు–ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి–మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి— యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా
7 –మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.౹
8 అందుకు వారు–అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా–ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.౹
9 వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితోకూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్చుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి–దైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.౹
10 అందుకు ఏలీయా— నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండిదిగి వానిని వాని యేబదిమందిని దహించెను.౹
11 మరల రాజు ఏబదిమందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి–దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.౹
12 అందుకు ఏలీయా–నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.౹
13 ఇంకను రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితోకూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని–దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము.౹
14 చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వానివాని యేబదిమందితోకూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవిచేయగా
15 యెహోవాదూత–వానికి భయపడక వానితోకూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితోకూడ రాజునొద్దకు వచ్చెను.౹
16 అతడు వచ్చి రాజును చూచి–విచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.౹
17 ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను.౹
18 అహజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
1
యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా2 ఏలీయా— యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా–యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.౹
3 బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి–నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు–నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను.౹
4 పిమ్మట ఏలీయా–ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.౹
5 యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి–నేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు–నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను.౹
6 అంతట ఏలీయా–యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి.౹
7 ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి.౹
8 అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.౹
9 వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి–నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా–నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను.౹
10 అందుకతడు–నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.౹
11 వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను
12 ఎలీషా అది చూచి–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.౹
13 మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి
14 ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి–ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.౹
15 యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి–ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి
16 అతనితో ఇట్లనిరి–ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు; మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసియుండునేమో అని మనవిచేయగా అతడు–ఎవరిని పంపవద్దనెను.౹
17 అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడుదినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.౹
18 వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడు–వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను.
19
అంతట ఆ పట్టణపువారు–ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నదిగాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సా రమై యున్నదని ఎలీషాతో అనగా20 అతడు–క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా
21 అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, — యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.౹
22 కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.
23
అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి —బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యముచేయగా24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను.౹
25 అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను.
1
అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను.౹2 ఇతడు తన తలి దండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతాస్తంభమును తీసివేసెనుగాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను
3 ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.
4
మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.౹5 అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటుచేయగా
6 యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.౹
7 యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి–మోయాబురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడు–నేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను.౹
8 –మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు–ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.౹
9 ఇశ్రాయేలురాజును యూదారాజును ఎదోమురాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితోకూడనున్నదండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.౹
10 ఇశ్రాయేలురాజు–కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా
11 యెహోషాపాతు–అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలురాజు సేవకులలో ఒకడు–ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా
12 యెహోషాపాతు —యెహోవా ఆజ్ఞ యితనిద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలురాజును యెహోషాపాతును ఎదోమురాజును అతని యొద్దకుపోగా
13 ఎలీషా ఇశ్రాయేలురాజును చూచి–నాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను. —ఆలాగనవద్దు, మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మాముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలురాజు అతనితో అనినప్పుడు
14 ఎలీషా ఇట్లనెను–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుట కైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును.౹
15 నాయొద్దకు వీణె వాయించగల యొకనిని తీసికొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.౹
16 — యెహోవా సెలవిచ్చినదేమనగా — ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;౹
17 యెహోవా సెలవిచ్చునదేమనగా–గాలియేగాని వర్షమేగాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.౹
18 ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును.౹
19 మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్లనెల్ల నరికి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను.౹
20 ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను.౹
21 తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి.౹
22 ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను
23 గనుక వారు–అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.౹
24 వారు ఇశ్రాయేలువారి దండుదగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి.౹
25 మరియు వారు పట్టణములను పడగొట్టి, సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచి యుండెనుగాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి.౹
26 మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు ఏడువందలమందిని ఏర్పరచుకొని, ఎదోమురాజునొద్దకు తీసికొని పోవుటకు యత్నించెనుగాని అది వారివలన కాకపోయెను.౹
27 అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠకుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలువారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.
1
అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా2 ఎలీషా–నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను. అందుకామె–నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను.౹
3 అతడు–నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము;౹
4 అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా
5 ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.౹
6 పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు–మరేమియు లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి పోయెను.౹
7 ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు–నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
8
ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ–భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనముచేయుచువచ్చెను.౹9 కాగా ఆమె తన పెనిమిటిని చూచి–మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.౹
10 కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పు డెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.౹
11 ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.౹
12 పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి–ఈ షూనేమీయురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు
13 అతడు–నీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆప్రకారము ఆమెతో అనెను. అందుకామె–నేను నా స్వజనులలో కాపురమున్నాననెను.౹
14 ఎలీషా–ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానినడుగగా గేహజీ–ఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను.౹
15 అందుకతడు–ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా
16 ఎలీషా —మరుసటియేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని–దైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాల నైన నాతో అబద్ధమాడవద్దనెను.౹
17 పిమ్మట ఆ స్త్రీ గర్భవతియై మరుసటియేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.౹
18 ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారియొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడు–నా తలపోయెనే నా తల పోయెనే, అని తన తండ్రితో చెప్పెను.౹
19 అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా
20 వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొని యుండి చనిపోయెను.౹
21 అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి
22 –ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము; నేను దైవజనునియొద్దకు పోయి వచ్చెదనని తన పెనిమిటితో ఆమె యనగా
23 అతడు–నేడు అమావాస్య కాదే; విశ్రాంతిదినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె–నేను పోవుట మంచిదని చెప్పి
24 గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పని వానితో–శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనేగాని నిమ్మళముగా తోలవద్దనెను.౹
25 ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనునియొద్దకు వచ్చెను. దైవజనుడు దూరమునుండి ఆమెను చూచి— అదిగో ఆ షూనేమీయురాలు;౹
26 నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి–నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామె— సుఖముగా ఉన్నామని చెప్పెను.౹
27 పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు — ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.౹
28 అప్పుడు ఆమె–కుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవిచేయగా
29 అతడు–నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడినయెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.౹
30 తల్లి ఆ మాట విని–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతోకూడ పోయెను.౹
31 గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెనుగాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి — బాలుడు మేలుకొనలేదని చెప్పెను.౹
32 ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి
33 తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి
34 మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.౹
35 తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.౹
36 అప్పుడతడు గేహజీని పిలిచి–ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతనియొద్దకు రాగా అతడు–నీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను.౹
37 అంతట ఆమె లోప లికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను.
38
ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి —పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను.౹39 అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.౹
40 తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి —దైవజనుడా,కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.౹
41 అతడు–పిండి కొంత తెమ్మనెను. వారు తేగా–కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగాకుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.
42
మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవలపిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.౹43 అయితే అతని పనివాడు–నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు–వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.౹
44 పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.
1
సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలియైయుండెనుగాని అతడు కుష్ఠరోగి.౹2 సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలుదేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.౹
3 అది–షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను.౹
4 నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా
5 సిరియా రాజు–నేను ఇశ్రాయేలురాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొనిపోయి ఇశ్రాయేలురాజునకు పత్రికను అప్పగించెను.౹
6 ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా–నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రి కను అతనిచేత నీకు పంపించియున్నాను.౹
7 ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని— చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను.౹
8 ఇశ్రాయేలురాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు–నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను.౹
9 నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా
10 ఎలీషా–నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.౹
11 అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను–అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని.౹
12 దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలుదేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను.౹
13 అయితే అతని దాసులలో ఒకడు వచ్చి–నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు
14 అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులుమునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.౹
15 అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచి–చిత్తగించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా
16 ఎలీషా —ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసి కొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను.౹
17 అప్పుడు–యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా?
18 నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారముచేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా
19 ఎలీషా–నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషాయొద్దనుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను.
20
అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ— సిరియనుడైన యీ నయమాను తీసికొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని21 నయమానును కలిసికొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముమీదనుండి దిగి వానిని ఎదుర్కొని— క్షేమమా అని అడిగెను. అతడు–క్షేమమే అని చెప్పి
22 –నా యజమానుడు నాచేత వర్తమానము పంపి–ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను.౹
23 అందుకు నయమాను–నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి.౹
24 మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.౹
25 అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచి–గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు–నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను.౹
26 అంతట ఎలీషా వానితో–ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
27 కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను.
1
అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి— ఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;౹2 నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చటనుండి తెచ్చుకొని మరియొకచోట నివా సము కట్టుకొందుమని మనవిచేయగా అతడు–వెళ్లుడని ప్రత్యుత్తరమిచ్చెను.౹
3 ఒకడు–దయచేసి నీ దాసులమైన మాతోకూడ నీవు రావలెనని కోరగా అతడు–నేను వచ్చెదనని చెప్పి
4 వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి.౹
5 ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు–అయ్యో నా యేలినవాడా, అది యెరవు తెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక
6 ఆ దైవజనుడు— అదెక్కడపడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.౹
7 అతడు–దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను.
8
సిరియారాజు ఇశ్రాయేలుతో యుద్ధముచేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచనచేసి–ఫలానిస్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను.౹9 అయితే ఆ దైవ జనుడు ఇశ్రాయేలురాజునకు వర్తమానము పంపి–ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి యున్నారని తెలియజేసెను గనుక
10 ఇశ్రాయేలురాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరికచేసిన స్థలమునకు పంపి సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెను. ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున
11 సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి–మనలో ఇశ్రాయేలురాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్ప రాదా అని వారి నడుగగా
12 అతని సేవకులలో ఒకడు— రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలురాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలురాజునకు తెలియజేయుననెను.౹
13 అందుకు రాజు–మేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను.౹
14 కాబట్టి రాజు అచ్చటికి గుఱ్ఱములను రథములను గొప్పసైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా
15 దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చి నప్పుడు గుఱ్ఱములును రథములునుగల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను. అంతట అతని పనివాడు–అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా
16 అతడు–భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి
17 –యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.౹
18 ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా–ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషాచేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను.౹
19 అప్పుడు ఎలీషా–ఇది మార్గముకాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకువానియొద్దకు మిమ్మును తీసికొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను.౹
20 వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు–యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థనచేయగా యెహోవావారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.౹
21 అంతట ఇశ్రాయేలురాజు వారిని పారజూచి–నాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా
22 అతడు–నీవు వీరిని కొట్టవద్దు; నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపెట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారుతిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్లుదురని చెప్పెను.౹
23 అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనులదండువారు ఇశ్రాయేలుదేశములోనికి వచ్చుట మానిపోయెను.
24
అటుతరువాత సిరియారాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను.౹25 అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మ బడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.౹
26 అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచి–రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని
27 –యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి
28 నీ విచారమునకు కారణమేమనియడుగగా అది–ఈ స్త్రీ నన్ను చూచి— నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు
29 మేము నా బిడ్డను వంటచేసికొని తింటిమి. అయితే మరునాటియందు నేను దాని చూచి–నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితినిగాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.౹
30 రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని యింక ప్రాకారముమీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను.౹
31 తరువాత రాజు–షాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక అనెను.౹
32 అయితే ఎలీషా తన యింట కూర్చునియుండగా పెద్దలును అతనితోకూడ కూర్చుండి యున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషాదగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి–ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి, ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండ తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసి వేయుడి; వాని యజమానుని కాళ్లచప్పుడు వానివెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా
33 ఆ దూత అతనియొద్దకు వచ్చెను. అంతట రాజు–ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి యుండవలెననెను.
1
అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను–యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా— రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.౹2 అందుకు ఎవరిచేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు— నీవు కన్నులార దానిని చూచెదవుగాని దానిని తినకుందు వని అతనితో చెప్పెను.
3
అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచి–మనము చచ్చిపోవువరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?4 పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనులదండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని
5 సందెచీకటియందు సిరియనులదండు పేటలోనికి పోవలెనని లేచి, సిరియనులదండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి.౹
6 యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులదండునకు వినబడునట్లుచేయగా వారు–మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలురాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని
7 లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.౹
8 కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి యొక గుడారము జొచ్చి భోజనపానములుచేసి, అచ్చటనుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొనిపోయి దాచిపెట్టి, తిరిగి వచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చటనుండి సొమ్ము ఎత్తికొనిపోయి దాచిపెట్టిరి.౹
9 వారు–మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చటనుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని
10 వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి–మేము సిరియనులదండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైననులేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవిగాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా
11 వాడు ద్వారపాల కుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా
12 రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి–సిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక–వారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.౹
13 అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవిచేసెను–ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదు గురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనయెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.౹
14 వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగా–సిరియనుల సైన్యమువెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.౹
15 కాబట్టి వారు వారివెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొందరగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా
16 జనులు బయలుదేరి సిరియనులదండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాటచొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.౹
17 ఎవని చేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పినప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.౹
18 మరియు–రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను.౹
19 ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటి కీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు–నీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను.౹
20 జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను.
1
ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచి–యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు; ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి–నీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా2 ఆ స్త్రీ లేచి దైవజనుని మాటచొప్పున చేసి, తన యింటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి యేడు సంవత్సరములు అక్కడ వాసముచేసెను.౹
3 అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.౹
4 రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి–ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.౹
5 అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీ–నా యేలినవాడ వైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా
6 రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటినుండి నేటివరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను.
7
ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియారాజైన బెన్హదదు రోగియైయుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని8 హజాయేలును పిలిచి–నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయి–ఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతనిద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.౹
9 కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచి–నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు–నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపె నని చెప్పెను.౹
10 అప్పుడు ఎలీషా–నీవు అతని యొద్దకు పోయి–నిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిచెప్పుము. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసెనని పలికి
11 హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను.౹
12 హజాయేలు–నా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.౹
13 అందుకు హజాయేలు–కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా–నీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచియున్నాడనెను.౹
14 అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు–ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు— నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.౹
15 అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను.
16
అహాబు కుమారుడును ఇశ్రాయేలువారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో అయిదవ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై యుండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏల నారంభించెను.౹17 అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడైయుండి యెరూషలేమందు ఎనిమిది సంవ త్సరములు ఏలెను.౹
18 ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹
19 అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.౹
20 ఇతని దినములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున
21 యెహోరాము తన రథములన్నిటిని తీసికొనిపోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదో మీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమతమ గుడారములకు పారిపోయిరి.౹
22 అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.౹
23 యెహోరాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
24 యెహోరాము తన పితరులతోకూడ నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.౹
25 అహాబు కుమారుడును ఇశ్రాయేలురాజునైన యెహోరాము ఏలు బడిలో పండ్రెండవ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా యేలనారంభించెను.౹
26 అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడైయుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలురాజైన ఒమ్రీ కుమార్తె.౹
27 అతడు అహాబు కుటుంబికుల ప్రవర్తనను అనుసరించుచు, వారివలెనే యెహోవా దృష్టికి చెడు తనము జరిగించెను; అతడు అహాబు ఇంటివారికి అల్లుడు.౹
28 అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియారాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరచిరి.౹
29 రాజైన యెహోరాము సిరియారాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.
1
అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేతపట్టుకొని రామో త్గిలాదునకు పోయి2 అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించి, అతని సహోదరులమధ్యనుండి అతనిని చాటుగా రప్పించి, లోపలి గదిలోకి అతనిని పిలుచుకొనిపోయి
3 తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసి–నేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము.౹
4 యౌవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చునప్పటికి సైన్యాధిపతులు కూర్చుని యుండిరి.౹
5 అప్పుడతడు–అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూ–యిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు–అధిపతీ నిన్నుగూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశించెను.౹
6 అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను–ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.౹
7 కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానినిబట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానినిబట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము.౹
8 అహాబు సంతతివారందరును నశింతురు; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండ అందరిని నిర్మూలము చేయుము.౹
9 నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.౹
10 యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.౹
11 యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడు–ఏమి సంభవించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడు–వానిని వాని మాటలు మీరెరిగే యున్నారని చెప్పెను.౹
12 కాబట్టి వారు–అదంతయు వట్టిది; జరిగినదానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను— నను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను.౹
13 అంతట వారు అతివేగిరముగా తమతమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించి–యెహూ రాజైయున్నాడని చాటించిరి.౹
14 ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాముమీద కుట్రచేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలువారందరును సిరియారాజైన హజాయేలును ఎదిరించుటకై రామో త్గిలాదు దగ్గర కావలియుండిరి.౹
15 అయితే యెహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూ–నీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి
16 రథముయెక్కి, యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పెట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి యుండెను.౹
17 యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచి యుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి–సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి–వారిని ఎదుర్కొనబోయి–సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.౹
18 కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కిపోయి అతనిని ఎదుర్కొని — సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ–సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు–పంపబడినవాడు వారిని కలిసికొనెనుగాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను.౹
19 రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చి–సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ–సమాధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.౹
20 అప్పుడు కావలివాడు–వీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీకుమారుడైన యెహూ తోలడమువలెనే యున్న దనెను.౹
21 –రథము సిద్ధముచేయుమని యెహోరాము సెలవియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమతమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.౹
22 అంతట యెహోరాము యెహూను చూచి–యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ–నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చుననెను.౹
23 యెహోరాము రథము త్రిప్పి–అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.౹
24 అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.౹
25 కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను–అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనిమీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.౹
26 అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు కాబట్టి నీవు యెహోవా మాటచొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.౹
27 యూదారాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను; అయినను యెహూ అతని తరిమి, రథమునందు అతని హతముచేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను.౹
28 అప్పుడు అతని సేవకులు అతనిని రథముమీద వేసి యెరూషలేమునకు తీసికొనిపోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి.
29
అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలు బడిలో పదకొండవ సంవత్సరమందు యూదాను ఏల నారంభించెను.30
యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా31 యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి–నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
32 అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి–నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.౹
33 –దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెను.౹
34 అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత–ఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా
35 వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.౹
36 వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను —ఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.౹
37 యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలెనుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున యిది జరిగెను.
1
షోమ్రోనులో అహాబునకు డెబ్బదిమంది కుమారు లుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులోనుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచినవారికిని పంపి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా–మీ యజమానుని కుమారులు మీయొద్ద నున్నారు;౹2 మరియు మీకు రథములును గుఱ్ఱములును ప్రాకారముగల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవు గదా
3 కాబట్టి యీ తాకీదు మీకు ముట్టినవెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొకని కోరుకొని, తన తండ్రి సింహాసనముమీద అతనిని ఆసీనునిగా చేసి, మీ యజమానుని కుటుంబికుల పక్షమున యుద్ధమాడుడి.౹
4 వారు ఇది విని బహు భయపడి–ఇద్దరు రాజులు అతనిముందర నిలువజాలక పోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని
5 కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచినవారును కూడి యెహూకు వర్తమానము పంపి–మేము నీ దాసులము; నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము; మేము ఎవనిని రాజుగా చేసికొనము; నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి.౹
6 అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి–మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనినయెడల మీ యజమానుని కుమారుల తలలను తీసికొని, రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బదిమంది రాజకుమారులును వారిని పెంచిన పట్టణపు పెద్దలయొద్ద ఉండిరి.౹
7 కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బదిమంది రాజకుమారులను పట్టుకొని చంపి, వారి తలలను గంపలలో పెట్టి, యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి.౹
8 దూత అతనియొద్దకు వచ్చి–రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు–ఉదయమువరకు ద్వారము బయటిస్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను.౹
9 ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి, జనులందరిని చూచి–మీరు నిర్దోషులు, నేను నా యజమానునిమీద కుట్రచేసి అతని చంపితిని; అయితే వీరందరిని ఎవరు చంపిరి?
10 అహాబు కుటుంబికులనుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరక పోదు; తన సేవకుడైన ఏలీయాద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను.౹
11 ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువులనందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు.౹
12 అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి
13 యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని— మీరు ఎవరని వారి నడుగగా వారు–మేము అహజ్యా సహోదరులము; రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్లుచున్నామని చెప్పిరి.౹
14 వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని యొకనినైన విడువక గొఱ్ఱె వెండ్రుకలు కత్తి రించు ఇంటి గోతిదగ్గర నలువది ఇద్దరిని చంపిరి.
15
అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి–నీయెడల నాకున్న ట్టుగా నాయెడల నీకున్నదా అని అతని నడుగగా యెహో నాదాబు–ఉన్నదనెను. —ఆలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యివేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని16 –యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.౹
17 అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహాబును నిర్మూలము చేయువరకు హతముచేయుట మానకుండెను.౹
18 తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను–అహాబు బయలుదేవతకు కొద్ది గానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజచేయబోవుచున్నాను,౹
19 కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందరిని వాని భక్తులనందరిని వారి యాజకులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలునకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను.౹
20 మరియు యెహూ–బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి.౹
21 యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి, రానివాడు ఒకడును లేడు; వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలు గుడి ఈతట్టునుండి ఆతట్టువరకు నిండిపోయెను.౹
22 అప్పుడతడు వస్త్రశాలమీద ఉన్న అధికారిని పిలిచి–బయలునకు మ్రొక్కువారికందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను.౹
23 యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ — యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్దనుండనియ్యక బయలునకు మ్రొక్కువారుమాత్రమే యుండునట్లు జాగ్రత్తచేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను.౹
24 బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూయెనుబదిమందిని బయట కావలియుంచి–నేను మీ వశముచేసినవారిలో ఒకడైన తప్పించుకొనిపోయినయెడల వాని ప్రాణమునకు బదులుగా వానిపోనిచ్చినవాని ప్రాణముతీతునని వారితో చెప్పి యుండెను.౹
25 దహనబలులనర్పించుట సమాప్తికాగా యెహూ–మీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతులతోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి
26 బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి.౹
27 మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది
28 ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలువారిమధ్యనుండకుండ నాశనము చేసెను.౹
29 అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు.౹
30 కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను–నీవు నా హృదయాలోచనయంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరమువరకు ఇశ్రాయేలురాజ్యసింహాసనముమీద ఆసీనులగుదురు.౹
31 అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాముచేసిన పాపములను యెహూ యేమాత్రమును విసర్జించనివాడై ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయెను.
32
ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను.౹33 హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో నున్న యొర్దాను తూర్పుదిక్కున గాదీయులకును రూబే నీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను, అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను, అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను.౹
34 యెహూచేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
35 అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధిచేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను.౹
36 షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము ఇరువది యెనిమిది యేండ్లు.
1
అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి బొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను.౹2 రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును, హతమైన రాజకుమారులతోకూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడకుండెను.౹
3 అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరుసంవత్సరములు యెహోవామందిరమందు దాదితోకూడ దాచబడి యుండెను.
4
ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరములోనికి వారిని తీసికొనిపోయి, యెహోవామందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను5 –మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతిదినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;౹
6 ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.౹
7 మరియు విశ్రాంతిదినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.౹
8 మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవేశించినయెడల వాని చంపవలెను, రాజు బయలుదేరి సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను.౹
9 శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను.౹
10 యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా
11 కాపు కాయువారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడికొన మొదలుకొని యెడమకొనవరకు రాజుచుట్టు నిలిచిరి.౹
12 అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతనిచేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి–రాజు చిరంజీవి యగునుగాకని చాటించిరి.౹
13 అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవామందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి
14 రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని — ద్రోహము ద్రోహము అని కేక వేయగా
15 యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు — యెహోవామందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక
16 రాజమందిరములోనికి గుఱ్ఱములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి.
17
అప్పుడు యెహోయాదా–జనులు యెహోవావారని ఆయన పేరట రాజుతోను జనులతోను నిబంధన చేయిం చెను, మరియు అతడు రాజుపేరట జనులతో నిబంధన చేయించెను.౹18 అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.౹
19 అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములోనున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.౹
20 మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులందరును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.౹
21 యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.
1
యెహూ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో నలువది సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా.౹2 యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడైయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను.౹
3 అయితే ఉన్నతస్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నతస్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.
4
యోవాషు యాజకులను పిలిపించి–యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛచేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును,౹5 యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను.౹
6 అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమువరకును యాజకులు మందిరముయొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక
7 యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగి లిన యాజకులను పిలిపించి–మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయక పోతిరి? ఇకను మీ మీ నెలవైన వారియొద్ద ద్రవ్యము తీసికొనక, మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి యుండెను.౹
8 కాబట్టి యాజకులు–మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుట మా వశములేదు గనుక జనులయొద్ద ద్రవ్యము ఇక తీసికొనమని చెప్పిరి.౹
9 అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి.౹
10 పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియ జేయగా రాజుయొక్క ప్రధానమంత్రియును ప్రధానయాజకుడును వచ్చి, యెహోవామందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి.౹
11 తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు, అనగా పనిచేయించు వారి కప్పగించిరి; వీరు యెహోవామందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసెపనివారికిని రాతిపనివారికిని
12 యెహోవామందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి.౹
13 యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకా లైనను, బంగారు పాత్రలైనను, వెండిపాత్రలైనను చేయబడలేదుగాని
14 మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగుచేయించిరి.౹
15 మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.౹
16 అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను.
17
అంతట సిరియారాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా18 యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసికొని సిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేమునొద్దనుండి తిరిగిపోయెను.౹
19 యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
20 అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి.౹
21 ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అమజ్యా అతనికి మారుగా రాజాయెను.
1
యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను.౹2 ఇతడు ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹
3 కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలువారిమీద రగులుకొనగా ఆయన సిరియారాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలువారిని వారి కప్పగించెను.౹
4 అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను.౹
5 కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొనిమునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి.౹
6 అయినను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను.౹
7 రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనముచేసి యుండెను.౹
8 యెహోయాహాజు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹
9 యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను.
10
యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారం భించి పదునారుసంవత్సరములు ఏలెను.౹11 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటి ననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹
12 యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని అంతటినిగూర్చియు, యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
13 యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను.
14
అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడై యుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.౹15 అందుకు ఎలీషా–నీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను.౹
16 –నీ చెయ్యి వింటిమీద ఉంచుమని అతడు ఇశ్రాయేలురాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి
17 –తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా —బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు–ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనులచేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతముచేయుదు వని చెప్పి,౹
18 బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలురాజుతో–నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.౹
19 అందునిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి–నీవు అయిదుమారులైన ఆరుమారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.
20
తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు21 కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.
22
యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.౹23 గాని యెహోవావారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను.౹
24 సిరియారాజైన హజాయేలు మరణముకాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.౹
25 అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసి కొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.
1
ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.౹2 అతడు ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువదితొమ్మిది సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెహోయద్దాను.౹
3 ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక పోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను.౹
4 అయితే అతడు ఉన్నతస్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నతస్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.౹
5 రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను.౹
6 అయితే— కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణశిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.౹
7 మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.
8
అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి–మనము ఒకరి నొకరము దర్శించునట్లు నన్ను కలియ రమ్మని వర్తమానముచేయగా9 ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను–లెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటి–నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానో నులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.౹
10 నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతనుబట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతోకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను
11 అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా
12 యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమతమ గుడారములకు పారిపోయిరి.౹
13 మరియు ఇశ్రాయేలురాజైన యెహోయాషు అహజ్యాకుపుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మమువరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.౹
14 మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్తవస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.౹
15 యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలురాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹
16 అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.
17
యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.౹18 అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడి యున్నది.౹
19 అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెనుగాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.౹
20 వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.౹
21 అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభి షేకము చేసిరి.౹
22 ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.
23
యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా యేలుబడిలో పదునయిదవ సంవత్సరమందు ఇశ్రాయేలురాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి నలువదియొక సంవత్సరములు ఏలెను.౹24 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹
25 గత్హేపరు ఊరివాడైన అమిత్త యికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రమువరకు ఇశ్రాయేలువారి సరిహద్దును మరల స్వాధీనము చేసికొనెను.౹
26 ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.౹
27 యెహోవా ఇశ్రాయేలువారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకా శము క్రిందనుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి యుండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను.౹
28 యరొబాము చేసిన యితరకార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు, అతడు చేసిన యుద్ధమునుగూర్చియు, దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రాయేలువారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
29 యరొబాము తన పితరులైన ఇశ్రాయేలురాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.
1
ఇశ్రాయేలురాజైన యరొబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదారాజైన అమజ్యా కుమారుడైన అజర్యా యేలనారంభించెను.౹2 అతడు పదునారేండ్లవాడై యేలనారంభించి యెరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెకొల్యా.౹
3 ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.౹
4 ఉన్నతస్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నతస్థలములయందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.౹
5 యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.౹
6 అజర్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
7 అజర్యా తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను.
8
యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పది యెనిమిదవ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఆరునెలలు ఏలెను.౹9 ఇతడు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు, తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరి గించెను.౹
10 యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీదపడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను.౹
11 జెకర్యా చేసిన కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹
12 –నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులైయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను.
13
యూదారాజైన ఉజ్జియా యేలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెలదినములు ఏలెను.౹14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీదపడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.౹
15 షల్లూము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.౹
16 మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరిని హతము చేసి, తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను.
17
యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పదితొమ్మిదవ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలువారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను.౹18 ఇతడును తన దినములన్నియు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక యనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹
19 అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండువేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.౹
20 మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరురాజు దేశమును విడిచి వెళ్లిపోయెను.౹
21 మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹
22 మెనహేము తన పితరులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను.
23
యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.౹24 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹
25 ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబదిమందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులో నున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.౹
26 పెకహ్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
27
యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సరములు ఏలెను.౹28 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹
29 ఇశ్రాయేలురాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను.౹
30 అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీదపడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.౹
31 పెకహు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.
32
ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను.౹33 అతడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తెయైన యెరూషా.౹
34 ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను.౹
35 అయినను ఉన్నతస్థలములను కొట్టివేయకుండెను; జనులు ఉన్నతస్థలములందు ఇంకను బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న యెత్తయిన ద్వారమును కట్టించెను.౹
36 యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
37 ఆ దినములో యెహోవా సిరియారాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశముమీదికి పంపనారంభించెను.౹
38 యోతాము తన పితరులతోకూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను.
1
రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను.౹2 ఆహాజు ఏలనారంభించి నప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.౹
3 అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలుచేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను.౹
4 మరియు అతడు ఉన్నతస్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.౹
5 సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరిగాని అతనిని జయింపలేక పోయిరి.౹
6 ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.౹
7 ఇట్లుండగా ఆహాజు యెహోవామందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి
8 –నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా
9 అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.౹
10 రాజైన ఆహాజు అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి, దాని పోలికెను, మచ్చును, దాని పని విధ మంతయును యాజకుడైన ఊరియాకు పంపెను.౹
11 కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.౹
12 అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి
13 దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.౹
14 మరియు యెహోవా సన్నిధినున్న యిత్తడి బలిపీఠమును మందిరము ముంగిటిస్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.౹
15 అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగా–ఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజుచేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.౹
16 కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను.౹
17 మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీద నున్న తొట్టిని తొలగించెను, ఇత్తడి యెడ్లమీద నున్న సముద్రమును దింపి రాతి కట్టుమీద దానిని ఉంచెను.౹
18 మరియు అతడు అష్షూరు రాజునుబట్టి విశ్రాంతిదినపు ఆచరణకొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యెహోవా మందిరమునుండి తీసివేసెను.౹
19 ఆహాజుచేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
20 ఆహాజు తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.
1
యూదారాజైన ఆహాజు ఏలుబడిలో పండ్రెండవ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను.౹2 అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలురాజులు చెడుతనము చేసినంతమట్టుకు చేయకపోయినను, యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను.౹
3 అతని మీదికి అష్షూరురాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను.౹
4 అతడు ఐగుప్తురాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరురాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.౹
5 అష్షూరురాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రో నును ముట్టడించెను.౹
6 హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.౹
7 ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండియు, ఐగుప్తురాజైన ఫరోయొక్క బలము క్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి
8 తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణ యించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.౹
9 మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములుగల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని
10 యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి
11 తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి
12 –చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటినిచేసి పూజించుచుండిరి.౹
13 అయినను–మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీపితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,౹
14 వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమపితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.౹
15 వారు ఆయన కట్టడలను, తమపితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణ యించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై–వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.౹
16 వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోతవిగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి.౹
17 మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుకచేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.౹
18 కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.౹
19 అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.౹
20 అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.౹
21 ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలోనుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసికొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలువారు యెహోవాను అనుసరింపకుండ ఆయనమీద వారిని తిరుగబడచేసి, వారు ఘోరపాపము చేయుటకు కారకుడాయెను.౹
22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక
23 తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.
24
అష్షూరురాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులనురప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి.౹25 అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేనివారు గనుక యెహోవావారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను.౹
26 –తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియ కున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరురాజుతో మనవిచేయగా
27 అష్షూరు రాజు–అచ్చటనుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొనిపోవుడి; అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను.౹
28 కాగా షోమ్రోనులోనుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి, యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెనుగాని
29 కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నతస్థలములమందిరములలో వాటిని ఉంచుచువచ్చిరి; మరియు వారు తమతమ పురములలో తమకు దేవతలను కలుగజేసికొనిరి.౹
30 బబులోనువారు సుక్కోత్బెనోతు దేవతను, కూతావారు నెర్గలు దేవతను, హమాతువారు అషీమా దేవతను,౹
31 ఆవీయులు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలెకు అనెమ్మెలెకు అను సెపర్వయీముయొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి.౹
32 మరియు జనులు యెహోవాకు భయపడి, ఉన్నతస్థలములనిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసికొనగా వారు జనులపక్షమున ఉన్నతస్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచుండిరి.౹
33 ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులుగలవారైయుండి, తాము ఏ జనులలోనుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.౹
34 నేటివరకు తమ పూర్వమర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు; యెహోవాయందు భయభక్తులు పూనక —వారితో నిబంధనచేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు,౹
35 మహాధికారము చూపి బాహు బలముచేత ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరుపెట్టబడిన యాకోబు సంతతివారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు
36 ఆయన ఆజ్ఞాపించిన కట్టడలనుగాని విధులనుగాని ధర్మశాస్త్రమునుగాని ధర్మమందు దేనినిగాని అనుసరింపకయు ఉన్నారు.౹
37 మరియు–ఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.౹
38 నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.౹
39 మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండినయెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను
40 వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి.౹
41 ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమపితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు.
1
ఇశ్రాయేలురాజును ఏలా కుమారుడునైన హోషేయ యేలుబడిలో మూడవ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా యేలనారంభించెను.౹2 అతడు ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె; ఆమెకు అబీ అని పేరు.౹
3 తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను.౹
4 ఉన్నతస్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి యుండిరి
5 అతడు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదారాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు.౹
6 అతడు యెహో వాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొను చుండెను.౹
7 కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను.౹
8 మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.
9
రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారుడగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్టణముమీదికి వచ్చి ముట్టడివేసెను.౹10 మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయయేలు బడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను.౹
11 తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి.౹
12 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.
13
రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవ త్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా14 యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి–నావలన తప్పు వచ్చినది ; నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను.౹
15 కావున హిజ్కియా యెహోవామందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను.౹
16 మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.౹
17 అంతట అష్షూరురాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా
18 హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, రాజ్యపుదస్తావేజులమీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి.౹
19 అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను —ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు–మహా రాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా–నీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి?
20 యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?
21 నలిగిన రెల్లు వంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికిని అట్టివాడే.౹
22 –మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే. —యెరూషలేమందున్న యీ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా?
23 కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.౹
24 అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే.౹
25 యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు; —ఆ దేశముమీదికి పోయి దాని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను.౹
26 హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నా యోవాహు అనువారు–చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా
27 రబ్షాకే–ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద కూర్చున్నవారియొద్దకును నన్ను పంపెనుగదా అని చెప్పి
28 గొప్పశబ్దముతో యూదాభాషతో ఇట్లనెను–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా
29 –హిజ్కియాచేత మోసపోకుడి; నా చేతిలోనుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.౹
30 యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి–యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.౹
31 హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు; అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా–నాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును.౹
32 అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున–యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.౹
33 ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా?
34 హమాతు దేవతలు ఏమాయెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మాచేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?
35 యెహోవా మాచేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మాచేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను.౹
36 అయితే–అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి.౹
37 గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును, బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.
1
హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి2 గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను.౹
3 వీరు గోనెపట్ట కట్టుకొని అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి–హిజ్కియా సెలవిచ్చునదేమనగా–ఈ దినము శ్రమయు శిక్షయు దూష ణయు గల దినము; పిల్లలు పుట్టవచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు.౹
4 జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.౹
5 రాజైన హిజ్కియా సేవకులు యెషయాయొద్దకు రాగా
6 యెషయా వారితో ఇట్లనెను–మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా —అష్షూరురాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.౹
7 అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్లి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.
8
అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.౹9 అంతట కూషురాజైన తిర్హాకా తనమీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు, అతడు ఇంకొకసారి హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.౹
10 యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి — యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.౹
11 ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవుమాత్రము తప్పించుకొందువా?
12 నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారుగాని హారానువారు గాని, రెజెపులుగాని, తెలశ్శారులోనుండిన ఏదె నీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?
13 హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?
14 హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
15 యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను–యెహోవా, కెరూబులమధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకలరాజ్యములకు దేవుడవైయున్నావు.౹
16 యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము.౹
17 యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి
18 వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.౹
19 యెహోవా మా దేవా; లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.
20
అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను–ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా — అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను.౹21 అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగా–సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయుచున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.౹
22 నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి?
23 ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా.
నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర24
నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను
నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్ని
టిని ఎండిపో జేసియున్నాను.
25
నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు
పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు
నీకు వినబడలేదా?
ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ
లుగా చేయుట నావలననే సంభవించినది.
26
కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి
విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను
కాడవేయని చేలవలెను అయిరి.
27
నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు
లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు
తెలిసేయున్నవి.
28
నామీద నీవు వేయు రంకెలును
నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను
గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను.
నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను.
నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
29
మరియు యెషయా చెప్పినదేమనగా — హిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనమువిత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.30
యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.౹31 శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు; తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.౹
32 కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.౹
33 ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.౹
34 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
35
ఆ రాత్రియే యెహోవాదూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్షయెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.౹36 అష్షూరురాజైన సన్హెరీబు తిరిగి పోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత
37 అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించు కొనిపోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.
1
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతనియొద్దకు వచ్చి–నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా2 అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని
3 –యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.౹
4 యెషయా నడిమి శాలలోనుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను.౹
5 –నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము–నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా–నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవదినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.౹
6 ఇంక పదునయిదు సంవత్సరముల ఆయు ష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపా డుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.౹
7 పిమ్మట యెషయా–అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను.౹
8 –యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవదినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను
9 –తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా?
10 అందుకు హిజ్కియా యిట్లనెను–నీడ పదిమెట్లు ముంద రికి నడుచుట అల్పముగాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును.౹
11 ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను.
12
ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడునైన బెరోదక్బలదాను హిజ్కియా రోగియైయుండిన సంగతి విని, పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా13 హిజ్కియా, దూతలు వచ్చినమాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములుగల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను.౹
14 పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చి–ఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని అడుగగా హిజ్కియా–బబులోనను దూరదేశమునుండి వారువచ్చియున్నారని చెప్పెను.౹
15 –నీ యింటిలో వారు ఏమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా–నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను.౹
16 అంతట యెషయా హిజ్కియాతో ఇట్లనెను–యెహోవా సెలవిచ్చుమాట వినుము
17 –వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹
18 మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు.౹
19 అందుకు హిజ్కియా–నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞచొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధానము సత్యము కలిగినయెడల మేలేగదా అని యెషయాతో అనెను.౹
20 హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించినదానిని గూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
21 హిజ్కియా తన పితరులతోకూడ నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
1
మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్ల వాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా.౹2 అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.౹
3 తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను.౹
4 మరియు — నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవామందిరమందు బలిపీఠములను కట్టించెను.౹
5 మరియు యెహోవా మందిరమునకున్న రెండుసాలలలో ఆకాశసమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను.౹
6 అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుకచేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను
7 యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి–ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలోనుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవామందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను.౹
8 మరియు–ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని, నా సేవకుడగు మోషే వారికి వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనినయెడల వారి పితరులకు నేనిచ్చిన దేశములోనుండి వారి పాదములను ఇక తొలగి పోనియ్యనని యెహోవా సెలవిచ్చినమాట వారు వినక
9 ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.౹
10 కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను.౹
11 — యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.౹
12 కావున ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా— వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు
13 నేను షోమ్రోనును కొలిచిన నూలును, అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేముమీద సాగలాగుదును; ఒకడు పళ్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచి వేసెదను.౹
14 మరియు నా స్వాస్థ్యములో శేషించినవారిని నేను త్రోసివేసి వారి శత్రువులచేతికి వారిని అప్పగించెదను.౹
15 వారు తమపితరులు ఐగుప్తుదేశములోనుండి వచ్చిన నాటనుండి నేటివరకు నా దృష్టికి కీడుచేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరిచేత దోచబడి నష్టము నొందుదురు.౹
16 మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడతనడిచి, యూదా వారిని పాపములో దింపినదిగాక యెరూషలేమును ఈ కొననుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను.౹
17 మనష్షే చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతడు చేసిన దోషమునుగూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
18 మనష్షే తన పితరులతోకూడ నిద్రించి ఉజ్జాయొక్క తోటలో తన నగరుదగ్గర సమాధిచేయబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.
19
ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేమునందు రెండు సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొట్బయూరివాడగు హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు.౹20 అతడు తన తండ్రియైన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.౹
21 [21-22] తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు, తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను.౹
22
23 ఆమోను సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా
24 దేశపు జనులురాజైన ఆమోనుమీద కుట్రచేసిన వారినందరిని చంపి అతని కుమారుడైన యోషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి.౹
25 ఆమోను చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹
26 ఉజ్జాయొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యోషీయా అతనికి మారుగా రాజాయెను.
1
యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా.౹2 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.
3
రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు, మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మనిచెప్పి రాజు అతనితో ఈలాగు సెలవిచ్చెను.౹4 –నీవు ప్రధానయాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి, ద్వారపాలకులు జనులయొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము.౹
5 యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించువారిచేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత–యెహోవామందిర మందలి శిథిలమైన స్థలములను బాగుచేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దాని నియ్యవలెననియు
6 వడ్లవారికిని శిల్పకారులకును కాసెపనివారికిని మందిరమును బాగుచేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియ జెప్పుము.౹
7 ఆ అధికారులు నమ్మకస్థులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమునుగూర్చి వారియొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి.౹
8 అంతట ప్రధానయాజకుడైన హిల్కీయా— యెహోవామందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి
9 రాజునొద్దకు తిరిగి వచ్చి–మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పనివిషయములో అధికారులై పని జరిగించువారిచేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి
10 యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను.౹
11 రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపుమాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను.౹
12 తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా
13 –మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలనుగూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.౹
14 కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయాయును ప్రవక్తియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా
15 ఈమె వారితో ఇట్లనెను— మిమ్మును నాయొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియ జెప్పుడి
16 –యెహోవా సెలవిచ్చునదేమనగా–యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును.౹
17 ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నాకోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొనుచున్నది.౹
18 యెహోవాయొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి
19 –ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగా–ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవుచేయు మనవిని నేను అంగీ కరించియున్నాను.౹
20 నేను నిన్ను నీ పితరులయొద్ద చేర్చుదును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు; ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజు నొద్దకు తెచ్చిరి.
1
అప్పుడు రాజు యూదా పెద్దలనందరిని యెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి2 యూదావారినందరిని యెరూషలేము కాపు రస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను.౹
3 రాజు ఒక స్తంభముదగ్గర నిలిచి— యెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధనచేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.౹
4 రాజు–బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటిని యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను.౹
5 మరియు యూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను.౹
6 యెహోవామందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.౹
7 మరియు యెహోవామందిరమందున్న పురుషగాములయిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.౹
8 యూదా పట్టణములోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్రపరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను.౹
9 అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు.౹
10 మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను.౹
11 ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను.౹
12 మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.౹
13 యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొమోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి
14 ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను.౹
15 బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాముకట్టించిన ఆ ఉన్నతస్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నతస్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను.౹
16 యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను.౹
17 అంతట అతడు–నాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు–అది యూదాదేశము నుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి.౹
18 అందుకతడు–దానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి.౹
19 మరియు ఇశ్రాయేలురాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను.౹
20 అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజకులనందరిని బలిపీఠములమీద చంపించి వాటిమీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
21
అంతట రాజు–నిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా22 ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలురాజులయొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటివరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను.౹
23 ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను.౹
24 మరియు కర్ణపిశాచిగలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.౹
25 అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.౹
26 అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను.౹
27 కాబట్టి యెహోవా — నేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.౹
28 యోషీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹
29 అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.౹
30 అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
31
యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తెయగు హమూటలు.౹32 ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.౹
33 ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి
34 యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజును ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.౹
35 యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను.
36
యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా.౹37 ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను.
1
యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగా2 యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.౹
3 మనష్షే చేసిన క్రియలన్నిటినిబట్టియు, అతడు నిరపరాధులను హతముచేయుటనుబట్టియు, యూదావారు యెహోవా సముఖమునుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను.౹
4 అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.౹
5 యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించినదానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹
6 యెహోయాకీము తన పితరులతోకూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.౹
7 బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వశమున నున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను.
8
యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమి దేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.౹9 అతడు తన తండ్రి చేసినదానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.౹
10 ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి.౹
11 వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను.౹
12 అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతులును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజు నొద్దకురాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.౹
13 మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలురాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.౹
14 అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరునులేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను.౹
15 అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపెట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.౹
16 ఏడు వేలమంది పరాక్రమశాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపెట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.౹
17 మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.
18
సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియొక సంవత్సరములవాడు; అతడు యెరూషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను.౹19 అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయాయొక్క కుమార్తెయగు హమూటలు. యెహోయాకీముయొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.౹
20 యూదావారిమీదను యెరూషలేమువారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమునుబట్టి తన సముఖములోనుండి వారిని తోలివేయుటకై బబులోనురాజు మీద సిద్కియా తిరుగబడెను.
1
అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి.౹2 ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరమువరకు పట్టణము ముట్టడివేయబడియుండగా
3 నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను.౹
4 కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడలమధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.౹
5 అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లి పోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.౹
6 వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.౹
7 సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.
8
మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ నెలయేడవదినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి9 యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.౹
10 మరియు రాజదేహసంరక్షకుల అధిపతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి.౹
11 పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోనురాజు పక్షము చేరిన వారిని, సామాన్యజనులలో శేషించినవారిని రాజదేహసంరక్షకుల అధిపతియైన నెబూజరదాను చెరగొని పోయెనుగాని
12 వ్యవసాయదారులును ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చెను.౹
13 మరియు యెహోవామందిరమందున్న యిత్తడి స్తంభములను మట్లను యెహోవామందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.౹
14 సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొనిపోయిరి.౹
15 అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.౹
16 మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను.౹
17 ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీటచుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను.౹
18 రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.౹
19 మరియు ఆయుధస్థులమీద నియమింపబడియున్న అధిపతిని, పట్టణములోనుండి తీసికొని, రాజుసముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరకిన అయిదుగురిని, దేశపుజనులను సంఖ్య చేయువారి అధిపతియొక్క లేఖికుని, సామాన్యజనులలో పట్టణమందు దొరకిన అరువదిమందిని పట్టుకొనెను.౹
20 రాజదేహసంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసికొని రిబ్లా పట్టణమందున్న బబులోనురాజునొద్దకు రాగా
21 బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదావారు తమ దేశములోనుండి ఎత్తికొని పోబడిరి.౹
22 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండ నిచ్చిన వారిమీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను.
23
యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులందరును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పాపట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికి పుట్టిన యజన్యాను కూడి రాగా24 గెదల్యావారితోను వారి జనులతోను ప్రమాణముచేసి–కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవచేసినయెడల మీకు మేలు కలుగునని చెప్పెను.౹
25 అయితే ఏడవ మాసమందు రాజ వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యామీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.౹
26 అప్పుడు కొద్దివారేమి గొప్ప వారేమి జనులందరును, సైన్యాధిపతులును, లేచి కల్దీయుల భయముచేత ఐగుప్తుదేశమునకు పారిపోయిరి.
27
యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పదియేడవ సంవత్సరమున పండ్రెండవనెల యిరువది యేడవదినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములోనుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి28 అతనితో దయగా మాటలాడి, అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠములకంటె ఎత్తుచేసెను.౹
29 కాగా అతడు తన బందీగృహ వస్త్రములనుతీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రదికిన దినములన్నియు రాజు సన్నిధిని భోజనముచేయుచు వచ్చెను.౹
30 మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లు ఆ చొప్పున అతని కియ్యబడు చుండెను.